పోలీసుల ఎదుటే దళిత యువకుడు హత్య... కారణం ఇదే..!
అహ్మదాబాద్ : గుజరాత్లో దారుణం జరిగింది. పోలీసుల ఎదుటే దళిత యువకుడిని అతని సొంత బావలే అతికిరాతకంగా నరికి హత్య చేశారు. ఈ ఘటన అహ్మదాబాదులోని వార్మర్ గ్రామంలో చోటుచేసుకుంది. కచ్ ప్రాంతానికి చెందిన హరీష్ కుమార్ సోలంకి అనే దళిత యువకుడు అగ్రకులంకు చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆమె ప్రస్తుతం రెండునెలల గర్భిణీ. అయితే అమ్మాయి తల్లిదండ్రులు ఆమెను లాక్కెళ్లి ఇంట్లో పెట్టుకున్నారు. అయితే హరీష్ తన భార్యను తిరిగి తనతో తెచ్చుకునేందుకు అభయం అనే మహిళా హెల్ప్లైన్కు ఫోన్ చేసి సహాయం చేయాల్సిందిగా కోరాడు.
దీంతో రంగంలోకి దిగిన అభయం టీమ్... హరీష్తో పాటు పోలీసులను వెంటబెట్టుకుని హరీష్ భార్య ఇంటికి వెళ్లారు. హరీష్ బయట పోలీసు వాహనంలోనే కూర్చున్నాడు. తన అత్తమామలతో మాట్లాడేందుకు అభయం టీమ్ వెళ్లింది. ఆలోగా హరీష్ భార్య సోదరులు వరుసకు బావలు అయ్యేవారు కత్తులు,కట్టెలతో అతనిపై దాడి చేసి హత్యచేశారు. మొత్తం ఎనిమిది మంది దాడి చేశారు. పోలీసులు అక్కడ ఉన్నారన్న భయం లేకుండా వారు హరీష్పై దాడి చేసి హత్యచేశారు.
ఇక అభయం టీమ్తో పాటు మరో మహిళా కానిస్టేబుల్ అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడేందుకు లోపలికి వెళ్లిన సమయంలో ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. హత్య చేసిన వారు అక్కడి నుంచి పరార్ అయ్యాయరని ప్రస్తుతం వారికోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసినట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ పీడీ మాన్వర్ తెలిపారు. ఇదిలా ఉంటే సోమవారం రోజున అభయం టీమ్కు చెందిన భవికాకు హరీష్ మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఫోన్ చేశాడు. తన భార్య తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందిగా కోరాడు.
హరీష్ కోరినట్లుగానే తామంతా తన భార్య ఊర్మిళా ఇంటికి చేరుకుని ఆమె తల్లిదండ్రులతో చర్చలు జరిపామని... చర్చలు ముగిసిన తర్వాత సాయంత్రం ఏడు గంటల సమయంలో ఇంటిలోనుంచి బయటకు వచ్చినట్లు భవికా వివరించింది. బయటకు వచ్చే సరికి హరీష్పై పలువురు వ్యక్తులు దాడి చేస్తున్నారని తెలిపింది. అడ్డుగా వచ్చిన అభయం సిబ్బందిపై కూడా దాడి చేశారని వెల్లడించింది.