పెళ్లి విందులో పక్కన కూర్చున్నాడని దళితుడిని కొట్టి చంపిన అగ్రకులాల వ్యక్తులు
ఉత్తరాఖండ్: స్వాతంత్ర్యం సిద్ధించి 70ఏళ్లకు పైనే అవుతున్న దేశం నుంచి అంటరానితనం అనేది ఇంకా పూర్తిగా మాయం అవ్వలేదు. దేశం పురోగతిలో పయనిస్తున్నప్పటికీ అక్కడక్కడ కులం కోరలు చాస్తోంది. ఫలితంగా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్లో ఓ వివాహం సందర్భంగా విందు భోజనం ఏర్పాటు చేశారు. విందు భోజనంలో అంతా అగ్రకులాల వారే కూర్చున్నారు. వారితో పాటుగా ఓ దళితుడు కూడా భోజనానికి కూర్చున్నాడు.
జితేంద్ర అనే ఈ 23 ఏళ్ల యువకుడు చేసిన పాపం కేవలం భోజనం కోసం కూర్చోవడమే. అంతే జితేందర్ తమ ఎదురుగా కూర్చోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన అగ్రకులాలకు చెందిన వ్యక్తులు... సహనం కోల్పోయినట్లు డీఎస్పీ ఉత్తమ్ సింగ్ జిమ్వాల్ చెప్పాడు. దీంతో దళితుడైన జితేందర్ను చితకబాదినట్లు తెలిపారు. ఈ ఘటన ఏప్రిల్ 26వ తేదీన న్యూతేరీ జిల్లాలోని శ్రీకోట్ గ్రామంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు.
జితేందర్ను అగ్రకులాల వారు చితకబాదటంతో తీవ్రగాయాలయ్యాయి. గాయాలపాలైన జితేందర్ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ డెహ్రాడూన్ హాస్పిటల్లో జితేందర్ మృతిచెందాడు. దాదాపు 9 రోజుల పాటు ప్రాణాలకోసం పోరాడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. జితేంద్ర సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు జితేందర్ పై దాడి చేసిన ఘటనలో మొత్తం ఏడుమందిని అరెస్టు చేశారు. గజేంద్ర సింగ్, కుషాల్ సింగ్, గబ్బర్ సింగ్, గంభీర్ సింగ్, హర్బీర్ సింగ్, హుకుం సింగ్లను అరెస్టు చేసి వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.