అమానుషం : పోలీస్ కేసు పెట్టినందుకు.. బలవంతంగా మూత్రం తాగించే ప్రయత్నం...
ఉత్తరప్రదేశ్లో మరో దారుణం వెలుగుచూసింది. 65 ఏళ్ల ఓ దళిత వృద్దుడిపై దాడి చేసిన ఓ వ్యక్తి బలవంతంగా అతని చేత మూత్రం తాగించేందుకు యత్నించాడు. తనపై పెట్టిన కేసును విత్ డ్రా చేసుకోవడానికి నిరాకరించడంతో ఆ వృద్దుడితో పాటు అతని కొడుకుపై ఆ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్లోని రొడా గ్రామానికి చెందిన అమర్ (65),అతని కొడుకు ఓ వివాదం విషయంలో గ్రామానికి చెందిన సోను యాదవ్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది జీర్ణించుకోలేని సోను యాదవ్ అమర్తో పాటు అతని కొడుకుపై దాడి చేశాడు.
'ఒక కప్పులో అతని మూత్రం పోసి... మాతో బలవంతంగా తాగించే ప్రయత్నం చేశాడు. అందుకు నేను నిరాకరించడంతో కర్రతో నాపై దాడికి పాల్పడ్డాడు. నా కొడుకుపై గొడ్డలితో దాడి చేశాడు. కొద్దిరోజుల క్రితం అతనిపై మేము పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఆ కేసును ఉపసంహరించుకోవాలని అతను మమ్మల్ని వేధిస్తున్నాడు..' అని అమర్ వాపోయారు.
Lalitpur: A 65-yr-old Dalit man was allegedly beaten & forced to drink urine in Village Roda by a person against whom victim's family had filed a police complaint a week ago.
— ANI UP (@ANINewsUP) October 13, 2020
Accused was forcing the old man & his son to compromise & take back the police complaint.
(12.10.2020) pic.twitter.com/kk16CeqbwA
ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు లలిత్పూర్ ఎస్పీ మీర్జా మంజర్ వెల్లడించారు. నిందితుడు సోను యాదవ్ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామన్నారు. కేసుతో సంబంధం ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని... ఇలాంటి ఘటనలను ఉపేక్షించలేదని చెప్పారు.
హత్రాస్లో దళిత యువతిపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్న తరుణంలో.. మరో దళిత వ్యక్తిపై ఇలాంటి అమానవీయ దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది. క్రైమ్ రేటు ఎక్కువగా ఉండే యూపీలో దళితులపై దాడులు పెరుగుతూనే ఉన్నాయి.