దారుణం: దళితుడిపై మూకదాడి.. నీళ్లడిగితే మూత్రం తాగించారు, వ్యక్తి మృతి
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటుతున్నా ఇంకా దళితులపై దాడులు ఆగడం లేదు. దేశంలో ఏదో ఒక మూలానా దళితులపై అనునిత్యం దాడులు జరుగుతున్నాయనే దానికి తాజా ఉదంతమే నిదర్శనం. పంజాబ్లోని సంగ్రూర్ జిల్లాలో 37 ఏళ్ల దళిత వ్యక్తిపై కొందరు అమానుషంగా దాడి చేశారు. అంతేకాదు దాడిలో గాయపడ్డ అతడు తాగేందుకు మంచి నీళ్లు ఇవ్వాలని కోరగా మూత్రంను బలవంతంగా తాగించారు.
సంగ్రూర్ జిల్లా చంగాలివాలా గ్రామంలో ఓ దళిత వ్యక్తికి, రింకూ అనే వ్యక్తితో పాటు మరికొందరితో చిన్న గొడవ జరిగింది. ఈ గొడవ అక్టోబర్ 21న జరిగింది. అయితే గ్రామస్తులు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దు మణిగింది. ఇదే విషయం పోలీసులకు నవంబర్ 7వ తేదీన ఆ దళిత వ్యక్తి చెప్పినట్లు పోలీసులు చెప్పారు. రింకూ తనను ఇంటికి పిలిపించి మాట్లాడటంతో గొడవ సద్దు మణిగినట్లు పోలీసులకు దళిత వ్యక్తి చెప్పాడు. ఆ తర్వాత కొద్దిరోజులకు మళ్లీ నలుగురు వ్యక్తులు తనను పట్టుకుని స్తంభానికి కట్టేసి కొట్టారని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. తాగేందుకు నీళ్లు అడిగితే మూత్రం బలవంతంగా తాగించారని దళిత వ్యక్తి వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు చెప్పారు.
తీవ్రగాయాలపాలైన దళిత వ్యక్తిని పోస్టుగ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ మరియు రీసెర్చ్లో చికిత్స కోసం అడ్మిట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సందీప్ గార్గ్ చెప్పారు. అయితే చికిత్స పొందుతూ శనివారం ఉదయం చనిపోయినట్లు ఆయన వెల్లడించారు. ఇక తీవ్రంగా గాయపడటంతో ఇన్ఫెక్షన్ సోకిందని దీంతో ఆ వ్యక్తి కాళ్లను వైద్యులు తొలగించారని ఎస్పీ చెప్పారు. నిందితులపై సెక్షన్ 302కి కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినట్లు వెల్లడించారు.ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసి వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇక దళిత వ్యక్తి మృతి చెందాడని తెలుసుకున్న షెడ్యూల్ క్యాస్ట్ కమిషన్ సంగ్రూర్ ఎస్పీని ఘటనపై నివేదికను కోరింది. మీడియా ద్వారా విషయాన్ని తెలుసుకున్న తాను కేసును సుమోటోగా స్వీకరించి నివేదిక ఇవ్వాలని ఎస్పీని ఆదేశించినట్లు ఎస్సీ ఛైర్పర్సన్ తేజిందర్ కౌర్ చెప్పారు.