ఓటు ఒకరికి వేయబోయి మరొకరికేశాడు... తన తప్పుకు శిక్ష విధించుకున్నాడు ఏంటా శిక్ష?
ఉత్తర్ ప్రదేశ్ : తను నమ్ముకున్న పార్టీకి కాకుండా పొరపాటున మరో పార్టీకి ఓటు వేశాడన్న విషయాన్ని జీర్ణించుకోలేని ఓ యువకుడు తాను ఓటువేసిన వేలునే నరుక్కున్న ఘటన ఉత్తర్ప్రదేశ్లో చోటు చేసుకుంది. అసలు విషయానికొస్తే బహుజన్ సమాజ్వాదీ పార్టీ మద్దతు దారుడు పవన్ కుమార్ అనే 25 ఏళ్ల వ్యక్తి గురువారం ఓటువేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లాడు. ఓటువేసే సమయంలో ఈవీఎంపై బీఎస్పీకి కాకుండా బీజేపీ మీట నొక్కాడు. అంతే ఓటు బీజేపీకి పడిపోవడంతో చాలా బాధపడ్డాడు.
ఓటును తను ఇష్టపడే బహుజన్ సమాజ్ వాదీ పార్టీకి కాకుండా... బీజేపీకి ఓటు వేయడాన్ని పవన్ జీర్ణించుకోలేకపోయాడు. తను నమ్ముకున్న పార్టీకి తనవల్ల నష్టం జరిగిందని భావించి ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోయిన పవన్ తను ఓటు వేసిన వేలును తానే కట్ చేసుకున్నాడు. బులంద్షహర్ నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్ హులాస్పూర్ గ్రామంలోని శాంతిపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బీఎస్పీ-ఎస్పీ-ఆర్ఎల్డీ అభ్యర్థి యోగేష్ శర్మకు ఓటు వేయబోయి పొరపాటున బీజేపీ అభ్యర్థి భోలాసింగ్కు ఓటు వేశాడు.
వేలును నరుక్కున పవన్ను వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. చికిత్స తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పవన్ తెగనరుక్కున్న వేలును చూపిస్తూ తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. పొరపాటున ఓటు వేయడంతో తనకు తానే శిక్ష విధించుకున్నట్లు పవన్ చెప్పాడు. అయితే పొరపాట్లు జరుగుతుంటాయని అంతమాత్రాన ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడరాదంటూ బీఎస్పీ నేతలు చెప్పారు. అభిమానం ముఖ్యం కానీ పొరపాట్లు సహజమే అని అన్నారు. ఓటు వేసే ముందు సరిగ్గా చూసుకుని మీట నొక్కాలని బీఎస్పీ నేతలు పిలుపునిచ్చారు.