బస్సులో పాటలు పెట్టారని.. పెళ్లి బృందంపై రాళ్ల దాడి
ముజఫర్నగర్: పెళ్లి వేడుక సందర్భంగా వరుడు వచ్చే బస్సులో పాటలు పెట్టారని.. కొందరు గ్రామస్తులు బస్సుపై రాళ్లతో దాడి చేశారు. దీంతో బస్సులోని పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సోంటా గ్రామంలో చోటు చేసుకుంది.
పెళ్లి వేడుక దళితులది కావడమే ఈ దాడికి కారణంగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఫిరోజ్పూర్ నుంచి పెళ్లి బృందం బస్సులో పాటలు పెట్టుకుని ఉత్సాహంగా సోంటా గ్రామానికి చేరుకుంది. గ్రామానికి చేరుకోగానే కొందరు గ్రామస్తులు బస్సులో పాటలను ఆపేయాలని చెప్పారు.
అయితే బస్సులోని వారు వినకుండా పాటలను కొనసాగించారు. దీంతో పెళ్లి అనంతరం బస్సు తిరిగి వెళ్లే సమయంలో మార్గమధ్యలో దాదాపు 25 మంది గ్రామస్తులు బస్సును అడ్డుకుని రాళ్లు విసిరారు.
అంతటితో ఆగకుండా బస్సులోని 12 మంది యువకులపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు చెప్పారు.