దొంగతనం నెపంతో చిత్రహింసలు: రాజ్కోట్లో దళితుడు మృతి
రాజ్కోట్: రాజ్కోట్ సమీపంలోని షాపూర్ పారిశ్రామిక వాడలో దొంగతనం చేశాడనే నెపంతో ఫ్యాక్టరీ సిబ్బంది కర్రలతో ఓ దళితుడిపై విచక్షణరహితంగా బాదడంతో మృతి చెందాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ముఖేష్ సావ్జీవానియా అనే 40 ఏళ్ళ కాంట్రాక్టు కార్మికుడిని ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు కర్రలతో చితకబాదారు.ఫ్యాక్టరీలో దొంగతనం చేశారనే అనుమానంతో ఈ రకంగా బాదడంతో అతను మృత్యువాతపడ్డాడు.
ఈ ఘటనపై షాపూర్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోలీసుల కథనం ప్రకారంగా వానియా అతడి భార్య జయ, మరో మహిళ సవిత రాడియా ఫ్యాక్టరీ సమీపంలో చెత్తను ఏరుకొంటుండగా దొంగతనం చేశారనే నెపంతో ఫ్యాక్టరీ సిబ్బంది అతడిపై తీవ్రంగా దాడికి దిగారు. ఈ దాడిలో దళిత వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు.
మృతుడు వానియా సురేంద్రనగర్ జిల్లాలోని పర్ణాల గ్రామానికి చెందిన వాడుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన ఆదివారం నాడు ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో చోటు చేసుకొందని పోలీసులు చెప్పారు.
ఫ్యాక్టరీ పరిసరాల్లో చెత్త ఏరుకొనే నెపంతో ఫ్యాక్టరీ నుండి వస్తువులను దొంగతనానికి పాల్పడ్డారని ఫ్యాక్టరీ సిబ్బంది వానియాను బంధించి చితక్కొట్టారు. అయితే తీవ్రంగా గాయపడిన వానియాను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మరణించినట్టుగా వైద్యులు ప్రకటించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.