దారుణం: అగ్రవర్ణాలతో కలిసి భోంచేశాడని దళితుడి ముక్కు కోశారు
జలాన్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహ విందులో అగ్రవర్ణాలవారితో సహపంక్తి భోజనం చేశాడనే కారణంగా ఓ దళితుడి ముక్కు కోశారు. రాష్ట్రంలోని ఉన్నావ్ జిల్లాలో ఫిబ్రవరి 9న ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను బుందేల్ఖండ్కు చెందిన బీఎస్పీ ఎమ్మెల్సీ తిలక్చంద్ అహిర్వార్ తెలిపారు. విందు అనంతరం స్వగ్రామమైన శూర్పతిపురకు తిరిగి వచ్చిన యువకుడు అమర్సింగ్ దోహ్రేను అగ్రవర్ణాలవారు అడ్డుకుని, కత్తితో అతడి ముక్కు కోశారని ఆయన తెలిపారు.
మానవత్వం లేని వారు రక్తమోడుతున్నా పట్టించుకోకుండా వదిలేశారని చెప్పారు. నలుగురు నిందితులపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసినా దానినిని కేవలం దాడి చూపారని చెప్పారు. ఎస్సీఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు పెట్టలేదని ఆయన ఆరోపించారు.
కాగా, రక్తకారుతున్న అతడ్ని స్థానికులు, బంధువులు హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. నిందితులపై కేసు నమోదు చేశామని చెప్పిన డిఐజి ఏకె సింగ్, ఇప్పటి వరకు ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదని తెలిపారు. రాజకీయ సంబంధాల కారణంగానే నిందితులను అరెస్ట్ చేయలేదని బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు.