రాజస్థాన్లో దారుణం: దళిత మహిళపై భర్తముందే సామూహిక అత్యాచారం చేసిన దుండగులు
అల్వార్ : రాజస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. అల్వాల్లో భర్తముందే ఓ దళిత మహిళపై కొందరు సామూహిక అత్యాచారం చేశారు. దీంతో రాజస్థాన్ ఒక్కసారిగా భగ్గుమంది. ఏప్రిల్ 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
దళిత మహిళపై సామూహిక అత్యాచారం
ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా రాజస్థాన్ రాష్ట్రం అల్వార్లో ఓ దళిత మహిళపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన కలకలం సృష్టిస్తోంది. బాధితురాలు ఐదు మంది నిందితులపై ఫిర్యాదు చేయగా పోలీసులు పట్టించుకోకపోవడంతో ప్రభుత్వం అల్వార్ ఎస్పీ రాజీవ్ పచార్ పై వేటువేసింది. అంతేకాదు ఈ కేసులో అలసత్వం ప్రదర్శించిన స్టేషన్ హౌజ్ ఆఫీసర్ను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది.ఇదిలా ఉంటే ఇందర్రాజ్ గుర్జార్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు చెప్పిన డీజీపీ మిగతా నిందితుల కోసం 14 బృందాలు గాలిస్తున్నాయని వెల్లడించారు. రాజస్థాన్ రేపిస్తాన్ కాదన్న డీజీపీ... ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పోలీసులు ఈ వార్తను బయటపెట్టలేదని అన్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల వేళ ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్పై బీజేపీ విరుచుకుపడింది. ఘటనకు బాధ్యత సీఎం అశోక్ గెహ్లాట్దే అని ఆరోపించింది. ఈ గ్యాంగ్ రేప్ ఢిల్లీ నిర్భయ రేప్ ఘటన కంటే దారుణమైందని బీజేపీ మండిపడింది. ఈ ఘటనపై సీఎం అశోక్ గెహ్లాట్ సీరియస్ అయ్యారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. పోలీసులు నిందితులను అరెస్టు చేయాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రక్షణ కల్పించింది.
అసలేం జరిగింది....
ఏప్రిల్ 26వ తేదీన బాధిత మహిళ ఆమె భర్త ఇద్దరు తనగాజి ప్రాంతంలో బైకుపై వెళుతుండగా కొందరు వ్యక్తులు వారిని ఆపారు. బట్టలు విప్పాల్సిందిగా దంపతులను ఆదేశించారు. వారు తిరగబడటంతో వారిని చితకబాదారు. అనంతరం ఆమెపై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు ఈ ఘటనను వీడియో రికార్డింగ్ కూడా చేశారు. అంతేకాదు బాధితుల దగ్గర నుంచి కొంత మొత్తంలో డబ్బులను కూడా డిమాండ్ చేశారు దుర్మార్గులు. డబ్బులు ఇవ్వకపోవడంతో వీడియోను సోషల్ మీడియాలో లీక్ చేశారు. తన కళ్లముందే తన భార్యపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారం చేశారని ఆవేదన వ్యక్తం చేసిన బాధిత మహిళ భర్త ఓ వ్యక్తి అయితే రెండో సారి కూడా అత్యాచారం చేసేందుకు తెగబడ్డాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
నన్ను మెడపట్టి ఈడ్చుకెళ్లారు: బాధిత మహిళ
తనను మెడపట్టి ఈడ్చుకెళ్లి తన బట్టలను చింపివేసి ఐదుగురు అత్యాచారం చేశారని మహిళ కన్నీరుమున్నీరైంది. అంతకంటేముందు చిత్రహింసలకు గురిచేశారని వెల్లడించింది. అందులో ఒకడు ఆ గ్యాంగ్కు లీడర్లా వ్యవహరించాడని... రెండో సారి కూడా తనపై అత్యాచారం చేసేందుకు తెగబడ్డాడని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. రెండు మోటారు సైకిళ్లపై వచ్చిన దుండగులు తన భర్తను ఇద్దరు చితకబాదారని మరో ముగ్గురు తనపై లైంగికదాడి చేశారని బాధితురాలు తెలిపింది. తను పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న సమయంలో కూడా దుండగులు తనకు ఫోన్ చేసి బెదిరించారని మహిళ తెలిపింది. ఇదే విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకురాగా తమకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారని బాధిత మహిళ భర్త తెలిపాడు. పోలీసులు చెప్పినట్లుగా మే 2వ తేదీన తాను ఎస్పీని కలవలేదని ...ఏప్రిల్ 30న ఎస్పీని కలిసినట్లు ఆయన చెప్పాడు. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ను మే2న నమోదు చేశారని చెప్పాడు. ప్రస్తుతం ఎన్నికలతో బిజీగా ఉన్నామని పోలీసులు చెప్పినట్లు మహిళ భర్త వెల్లడించాడు.