కులం అడిగి మరీ చితగ్గొట్టారు: బిర్యానీ అమ్మే దళిత యువకుడిపై దాష్టీకం..!
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు పక్కన తోపుడు బండిపై బిర్యానీని విక్రయించే ఓ దళిత యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు..కులం అడిగి మరీ చితగ్గొట్టారు. దళితుడినని చెప్పిన తరువాతే గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై పిడిగుద్దులు కురిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి చేసిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఉత్తర్ ప్రదేశ్ గౌతమబుధ నగర్ జిల్లా గ్రేటర్ నొయిడాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాధిత యువకుడు గ్రేటర్ నొయిడాలో నివసిస్తున్నాడు. తోపుడుబండిపై బిర్యానీని విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. గ్రేటర్ నొయిడా పరిధిలోని రబుపురా వద్ద బిర్యానీ విక్రయిస్తుండగా.. ముగ్గురు వ్యక్తులు అతని వద్దకు వచ్చారు. బిర్యానీని ఆర్డర్ చేశారు.
#Breaking: Dalit youth beaten up allegedly for selling Biryani in #GreaterNoida. The assailants had raised objections on Dalit youth selling biryani. FIR has been filed against three unknown suspects under sections of assault. Sections of ST/SC act has also been invoked. pic.twitter.com/TNe6EPVs0Q
— Muhammad Wajihulla (@wajihulla) December 14, 2019
బిర్యానీని తింటున్న సమయంలో ఆ ముగ్గురిలో ఒకడు.. కులం ఏమిటని బాధితుడిని ప్రశ్నించారు. తాను ఎస్సీ కులానికి చెందిన వాడినని బదులిచ్చాడు. దీనితో తాము తింటున్న బిర్యానీని అక్కడే పడేశారు. ఈ విషయం తమకు ముందే ఎందుకు చెప్పలేదంటూ దాడి చేశారు. పిడిగుద్దులు కురిపించారు. ముగ్గురూ ఒకేసారి కలిసి కొట్టడంతో ప్రతిఘటించలేకపోయాడు. తనను వదిలేయమని ప్రాధేయపడుతున్నప్పటికీ.. వారు వినిపించుకోలేదు.
స్థానికులు అడ్డుకోవడంతో అతడిని వదిలేసి, వెళ్లిపోయారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దాడికి పాల్పడిన ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు గౌతమబుద్ధ నగర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రణ్ విజయ్ సింగ్ తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే వారిని అరెస్టు చేస్తామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఆ ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేస్తామని అన్నారు.