బహిరంగ మూత్రవిసర్జన: దళిత యువకుడిని కొట్టి చంపిన మహిళలు: కాళ్లు, చేతులు కట్టేసి.. !
చెన్నై: తమిళనాడులో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. తాము నిత్యం నడిచే దారిలో మూత్ర విసర్జన చేస్తున్నాడనే కారణంతో.. ఓ దళిత యువకుడిని కొట్టి చంపారు కొందరు గ్రామస్తులు. ఈ నెల 12వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూకదాడితో ప్రమేయం ఉన్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేశారు. నిందితుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. తొలుత వారే అతణ్ని కొట్టినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
పెట్రోల్ బంకు కార్మికుడిగా..
తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడి పేరు ఆర్ శక్తివేల్. ఆది ద్రవిడ సామాజిక వర్గానికి చెందిన యువకుడు. జిల్లాలోని కరై గ్రామంలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. స్థానికంగా ఓ పెట్రోల్ బంకులో పని చేస్తున్నాడు. అతను పనిచేసే పెట్రోల్ బంకు సమీపంలో ఎస్ పుధూర్ గ్రామ ఉంది. ఆ గ్రామానికి వెళ్లాలంటే ప్రధాన రహదారి నుంచి కిలోమీటర్ పాటు నడవాల్సి ఉంటుంది.
మూత్ర విసర్జన చేస్తున్నాడంటూ..
పెట్రోల్ బంకు ఆనుకునే ఈ గ్రామానికి వెళ్లే దారి ఉండటం వల్ల శక్తివేల్ తరచూ ఆ మార్గంలో మూత్ర విసర్జనకు వెళ్తుండే వాడు. దీన్ని గమనించిన స్థానికులు అతణ్ని వారించినప్పటికీ.. వినిపించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నెల 12వ తేదీన కూడా బహరంగ మూత్ర విసర్జన చేస్తోన్న శక్తివేల్ను గమనించిన ముగ్గురు మహిళలు అతణ్ని పట్టుకుని నిలదీశారు. దీనితో అతను వారిని దూషించాడు. ఈ విషయాన్ని వారు గ్రామస్తులకు చెప్పడంతో వారంతా మూకుమ్మడిగా వచ్చి.. శక్తివేల్పై దాడి చేశారు.
ముగ్గురు మహిళలు సహా..
చేతులు, కాళ్లు కట్టేసి తీవ్రంగా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వారి దెబ్బలకు తట్టుకోలేక అతను ప్రాణాలను వదిలాడు. దీన్ని దాచి పెట్టడానికి పుధూర్ గ్రామస్తులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ.. ఫలితం రాలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పెరియత్ అచ్చుర్ పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఈ నెల 14వ తేదీన ముగ్గురు మహిళలు సహా శక్తివేల్పై దాడి చేసిన కొందరు గ్రామస్తులను అరెస్టు చేశారు. వారిని కడలూర్ కేంద్ర కారాగారానికి తరలించారు.
చెల్లెలి ఫిర్యాదు మేరకు..
అరెస్టయిన వారిలో వారంతా వన్నియర్ సామాజిక వర్గానికి చెందిన వారని పెరియత్ అచ్చుర్ ఎస్ఐ కే వినోద్ రాజ్ తెలిపారు. ఫుధూర్ గ్రామానికి చెందిన గౌరి, రాజాలను ప్రధాన నిందితులుగా గుర్తించినట్లు చెప్పారు. సంఘటన చోటు చేసుకున్న రోజు.. శక్తివేల్ నడవలేని స్థితిలో ఇంటికి చేరాడని మృతుడి చెల్లెలు వెల్లడించారు. కడుపు నొప్పితో బాధపడ్డాడని, గుచ్చి గుచ్చి ప్రశ్నించగా.. తనపై గ్రామస్తులు దాడి చేశారనే విషయాన్ని వెల్లడించాడని అన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రశ్నించడానికి వెళ్లిన చెల్లెలిపైనా దాడి..
శక్తివేల్ను కొట్టిన గౌరీ, రాజా సహా ఈ మూకదాడిలో ప్రమేయం ఉన్న వారిని ప్రశ్నించడానికి వెళ్లిన అతని చెల్లెలి మీద కూడా దాడి చేసినట్లు ఎస్ఐ వినోద్ రాజ్ చెప్పారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు. మరి కొంతమందిని అరెస్టు చేయాల్సి ఉందని అన్నారు. కేసు నమోదైన విషయం తెలుసుకున్న తరువాత కొందరు పరారయ్యారని, వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు.