భారత్ బంద్ తర్వాత దళితులపై హింస పెరిగింది: బిజెపి ఎంపీ ఉదిత్ రాజ్ సంచలనం
భోపాల్: భారత్ బంద్ తర్వాత దళితులపై హింస పెరిగిందని బిజెపికి చెందిన వాయువ్య ఢిల్లీ ఎంపీ ఉదిత్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్ల విషయమై ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు బిజెపి ఎంపీలు బిజెపి తీరుపై విమర్శలు గుప్పించారు. తాజాగా ఉదిత్ రాజ్ చేసిన ఈ విమర్శలు వీరికి తోడుగా నిలిచాయి.
భారతీయ జనతా పార్టీ నేతలు ఒక్కొక్కరిగా సొంత పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తుండటం రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నది. ఈ తరుణంలో తాజాగా వాయవ్య ఢిల్లీ నియోజక వర్గ ఎంపీ ఉదిత్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ బంద్ తర్వాత దళితులపై హింస పెరిగిపోయిందంటూ ప్రకటించి బాంబు పేల్చారు.
ఏప్రిల్ 2న భారత్ బంద్ తర్వాత దళితులపై దాడులు పెరిగిపోయాయి. ఈ మేరకు ఆధారాలతోసహా కథనాలు కూడా వెలువడుతున్నాయి. వాటిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ఉదిత్ రాజ్ శనివారం ఓ ట్వీట్ చేశారు. బార్మర్, జలోరే, జైపూర్, గ్వాలియర్, మీరట్, బులంద్షహర్, కరోలి.. ఇలా దేశంలోని వివిధ ప్రాంతాల్లో దళితులపై అక్రమ కేసులు బనాయించి పోలీసులు హింసిస్తున్నారని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. ఉదిత్ రాజ్ ప్రస్తావించిన ప్రాంతాలన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనివే కావడం గమనార్హం.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్కు చెందిన ఓ దళిత ఉద్యమవేత్తను పోలీసులు ఉత్త పుణ్యానికి దారుణంగా హింసించారంటూ ప్రత్యేకించి ఉదిత్ రాజ్ చెప్పటం చర్చనీయాంశంగా మారింది. కాగా, దళిత చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని చెప్పారు.