విమానంలో మెడపై చేతులేశాడు, అసభ్యంగా తాకాడు: వెక్కి వెక్కి ఏడ్చిన దంగల్ నటి (వీడియో)
న్యూఢిల్లీ: దంగల్ సినిమా నటి జైరా వాసీమ్కు విమానంలో చేదు అనుభవం ఎదురైంది. తోడి ప్రయాణీకుడు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తనపై చేతులు వేశాడని, అసభ్యంగా తాకాడని జైరా ఆరోపించింది. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కంటతడి పెట్టింది.
ఢిల్లీ నుంచి ముంబైకి విస్తారా విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో వెనుక కూర్చున్న వ్యక్తి చేసిన పనిని తన ఇన్స్టాగ్రామ్లో ఆమె పోస్ట్ చేసింది. తన వెనుక సీట్లో కూర్చున్న మధ్య వయస్సు వ్యక్తి, తన మెడను తాకుతూ సీటు కింద నుంచి కాళ్లు పెడుతూ అసభ్యంగా ప్రవర్తించాడని, ఇటువంటి ఘటన ఏ ఆడపిల్లకూ ఎదురు కాకూడదని ఆవేదన వ్యక్తం చేసింది.
తన పట్ల అసభ్యంగా తాకాడు
తన సీటుపై ఆ వ్యక్తి కాళ్లు పెట్టి, అసభ్యంగా తాకాడని, తాను అడిగితే, విమానం కుదుపుల వల్ల అలా పెట్టానని ఎదురు సమాధానం చెప్పాడని జైరా వాపోయింది. తన వీపు నిమిరాడని, విషయాన్ని సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించింది.
వీడియోలో ప్రశ్నించిన జైరా
అమ్మాయిలను ఆదుకునేదెవరని జైరా ఆ వీడియోలో ప్రశ్నించింది. ఎవరికి వారే సహాయం చేసుకునేలా ధైర్యంగా ఉండాలని సూచించింది. విమానం కుదుపుల వల్ల, తనకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉండటం వల్ల తాను అలా కాలు పెట్టానని అతను నిర్లక్ష్యంగా చెప్పాడని పేర్కొంది.
నిద్రపోతున్న సమయంలో మెడపై తడిమాడు
తాను నిద్రపోతున్న సమయంలో తన మెడపై ఆ వ్యక్తి తన కాలితో తడిమాడని, ఆ విషయాన్ని తాను గ్రహించిన తర్వాత ఆ దృశ్యాన్ని రికార్డు చేసేందుకు ప్రయత్నించానని జైరా చెప్పింది. కానీ విమానంలో లైటింగ్ తక్కువగా ఉండటంతో దృశ్యాలను చిత్రీకరించలేకపోయానని చెప్పింది.
కొంత వరకు ఆ దుశ్చర్య రికార్డ్ చేశా
కొంత వరకు మాత్రం ఆ దుర్మార్గుడి దుశ్యర్యను రికార్డ్ చేశానని చెప్పింది. తన మెడ, భుజంపై ఆ వ్యక్తి దాదాపు ఐదు నుంచి 10 నిమిషాల పాటు తడిమాడని జైరా వాపోయింది. ఈ ఘటనపై తాను తీవ్ర మనోవేధనకు గురవుతున్నట్లు పేర్కొంది. ఈ ఘటనపై జైరా వెక్కి వెక్కి ఏడ్చింది.
మహిళా కమిషన్ ఆగ్రహం
జైరాకు ఎదురైన చేదు అనుభవంపై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే నిందితుడి పేరు బయట పెట్టాలని విస్తారా ఎయిర్ లైన్స్ను ఆదేశించింది. అతని ప్రవర్తన సహించరానిది అని చెప్పింది. ఇలాంటి వ్యక్తుల నిజ స్వరూపం వారి కుటుంబ సభ్యులకు, సమాజానికి తెలిసేలా ఉండాలని చెప్పింది. తాను పోలీసులతో మాట్లాడుతానని, విస్తారా ఎయిర్ లైన్స్పై చర్యలు కోరుతానని కూడా మహిళా కమిషన్ తాత్కాలిక చైర్ పర్సన్ రేఖా శర్మ అన్నారు. కేబిన్ క్రూ దీనిపై ఎందుకు స్పందించలేదని నిలదీశారు.