"వాయు"గడం గడవలేదు: వచ్చేవారంలో గుజరాత్ను తాకనున్న తుఫాను
గుజరాత్ : గుజరాత్కు బ్యాడ్ న్యూస్. దిశ మార్చుకుని వెళ్లిందనుకున్న 'వాయు' తుఫాను తిరిగి అదే రాష్ట్రంపై పంజా విసిరేందుకు కదులుతోంది. అదేదో గుజరాత్పై పగపట్టినట్లుగా జూన్ 17-18వ తేదీల మధ్య 'వాయు'తుఫాను కచ్ తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తుఫాను క్రమంగా బలపడుతోందని కచ్ తీరం తాకేనాటికి మరింత బలపడి బీభత్సం సృష్టించేందుకు సిద్ధమవుతోందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
ప్రస్తుతం ఈ 'వాయు' తుఫాను గుజరాత్ పశ్చిమం దిశగా పయనిస్తోందని తుఫాను ధాటికి పోరబందర్, ద్వారకా జిల్లాలు భారీగా నష్టపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తుఫాను కదిలే సమయంలో గాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు వేగంతో వీచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది గంటకు 70 కిలోమీటర్ల వేగాన్ని కూడా తాకే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక గిర్, సోమ్నాథ్, జునాగఢ్ జిల్లాల్లో గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని చెబుతున్నారు. ఇక గాలి వేగం ఈ జిల్లాల్లో కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్మెంట్ చెబుతోంది. రానున్న 48 గంటల్లో పశ్చిమ తీరాన్ని తాకి అనంతరం గుజరాత్ ఈశాన్యం వైపు కదులుతుందని అధికారులు వివరించారు.
ఇక జూన్ 16 నాటికి 'వాయు' తుఫాను బలపడి గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.ఇప్పటికే గుజరాత్ ప్రభుత్వానికి సందేశం పంపామని తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు కేంద్రమంత్రిత్వ శాఖ తెలిపింది. గురువారం నాటికే వాయు తుఫాను గుజరాత్ తీరాన్ని తాకాల్సి ఉంది. అయితే దిశ మార్చుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ తిరిగి మళ్ళీ జూన్ 17-18న తీరాన్ని తాకే అవకాశాలున్నాయని చెప్పడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇక దిశ మార్చుకుందని తెలియడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడి నుంచి వెనుదిరిగాయి.. మళ్లీ ప్రమాదం ఉందని వార్తలు వస్తుండటంతో వారిని తిరిగి అక్కడికి చేరుకోవాలని సీఎం విజయ్ రూపానీ ఆదేశాలు ఇచ్చారు. ఇక ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇప్పటికే రెండు లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.