నీటి ఎద్దడి తప్పదా: ప్రధాన రిజర్వాయర్లలో తగ్గిన నీటి నిల్వలు
ఢిల్లీ: దేశంలో నీటి సమస్యలు తీవ్రతరం అవుతున్నాయి. భానుడు ఉగ్రరూపం దాల్చడంతో దేశంలోని ప్రధాన రిజర్వాయర్లలో నీరు అడుగంటిపోతోంది. గత పదేళ్లతో పోలిస్తే నీటి ఎద్దడి తీవ్రతరం అయ్యింది. దీంతో నీటి సంక్షోభం ఎప్పుడూ లేనంతగా విలయతాండవం చేస్తోంది.
ప్రధాన రిజర్వాయర్లలో నీటి కొరత
దేశంలోని 91 ప్రధాన రిజర్వాయర్లలో 30 మే 2019 నాటికి 31.65 బిలియన్ క్యూబిక్ మీటర్లు ఉన్నట్లు కేంద్ర జలవనరుల కమిషన్ పేర్కొంది. అంటే ఈ రిజర్వాయర్ల సామర్థ్యతలో 20శాతం మాత్రమే నీరు ఉన్నట్లు సెంట్రల్ వాటర్ కమిషన్ తెలిపింది. ఇది మే 23, 2019 నాటికి 21శాతంగా ఉన్నిందని జలవనరుల కమిషన్ వెల్లడించింది. పశ్చిమ భారత రాష్ట్రాల్లోని గుజరాత్, మహారాష్ట్రల్లో 27 ప్రధాన రిజర్వాయర్లలో 31.26 బిలియన్ క్యూబిక్ మీటర్లు మేరా నీరు ఉన్నట్లు తెలిపింది. సాధారణంగా ఉండాల్సిన దానికంటే చాలా తక్కువగా ఉందని అంటే కేవలం 11శాతం మాత్రమే నీరు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గతేడాది ఇదే సమయానికి 15శాతం నీరు ఈ రిజర్వాయర్లలో ఉన్నట్లు చెప్పారు.ఇక గత పదేళ్లలో సగటున 19శాతం నీరు రిజర్వ్ అయి ఉండేదని వెల్లడించారు. అయితే ఈ ఏడాది గతేడాది కంటే తక్కువ స్థాయిలో నీరు నిల్వలో ఉందని, గత పదేళ్లలో సగటున పోల్చినా ఈ ఏడాది అత్యంత తక్కువగా ఉందని అధికారులు తెలిపారు.
ఏపీ తెలంగాణ రిజర్వాయర్లలో తగ్గిన నీటి నిల్వ
ఇక దక్షిణభారతదేశంలో చూస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్నాటక, తమిళనాడుల్లో 31 ప్రధాన రిజర్వాయర్లు ఉన్నాయి. ఈ రిజర్వాయర్లలో 51.59 బిలియన్ క్యూబిక్ మీటర్ల స్టోరేజ్ కెపాసిటీ ఉంది. కానీ ప్రస్తుతం 5.91 బిలియన్ క్యూబిక్ మీటర్లు మేర మాత్రమే నీరు నిల్వలో ఉంది. అంటే 11శాతానికి పడిపోయినట్లు అధికారులు తెలిపారు.ఇక గతేడాది ఇది 12 శాతంగా ఉన్నింది. గత పదేళ్లలో సగటున 15శాతం స్టోరేజ్ కెపాసిటీ నమోదు కాగా ఈ సారి ఇది కూడా తక్కువగానే ఉంది.
వర్షాలు లేకపోవడంతోనే నీటి ఎద్దడి
గతేడాది గుజరాత్ మహారాష్ట్రల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. ఇక మరఠ్వాడా ప్రాంతంలో వర్షపాతం మరీ దారుణంగా పడిపోయింది. దీంతో అక్కడి రిజర్వాయర్లలో నీటి నిల్వ అత్యంత తక్కువగా నమోదైంది. ఇది ఆందోళన కలిగించే విషయం. ఇదిలా ఉంటే గతనెలలో విదర్భ, మరఠ్వాడా, పశ్చి మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో నమోదైన వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండగా దక్షిణ భారతంలో వర్షాలు సాధారణం కంటే తక్కువగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది ఇలానే కొనసాగితే రిజర్వాయర్లలో నీటి నిల్వ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.