సంచలనం : సమాచారమిస్తే ప్రాణాలకు ముప్పు, ఆర్ బి ఐ వింత సమాధానాలు
పెద్ద నగదు నోట్ల రద్దుపై సమాచారహక్కు చట్టం కింద సమాచారం కోరితే ఆర్ బి ఐ నుండి వచ్చిన సమాధానాలు సంచలనాలు రేపుతున్నాయి. ప్రాణాలకు ముప్పుంది,దేశ భద్రత అంటూ ఆర్ బి ఐ సమాధానాలను దాట వేసింది.
న్యూఢిల్లీ :పెద్ద నగదు నోట్ల రద్దు పై ఆర్ బిఐ ఇస్తోన్న సమాధానాలు సంచలనాలకు కారణమౌతున్నాయి.సమాచారహక్కు చట్టం కింద చేసుకొన్న
ధరఖాస్తులకు సరైన సమాధానాలు చెప్పకుండా ప్రాణాలకు ముప్పు, దేశ భద్రత అంటూ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండానే దాటవేస్తోంది ఆర్ బి ఐ.
పెద్ద నగదు నోట్ల రద్దును ప్రధానంగా నల్లధనాన్ని నిర్మూలించేందుకు చేసినట్టుగా కేంద్రం ప్రకటించింది. గత ఏడాది నవంబర్ 8వ, తేదిన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించాడు.
పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత ప్రజలు కొత్త కరెన్సీ కోసం అనేక ఇబ్బందులు పడ్డారు. ఇంకా దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో కరెన్సీ కష్టాలు తీరలేదు. ఈ పరిస్థితులను దృస్టిలో ఉంచుకొని విపక్షాలు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.
అసలు పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ఆర్ బి ఐకు సమాచార హక్కు చట్టం కింద పలువురు అనేక ప్రశ్నలను లేవనెత్తారు.అయితే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఆర్ బి ఐ దాటవేత ధోరణిని అవలంభిస్తోందని సమాచారహక్కు కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
సంచలనం రేపుతున్న ఆర్ బి ఐ సమాధానాలు
సమాచారహక్కు చట్టం కింద బ్లూమ్ బర్గ్ న్యూస్ ఆర్ బి ఐ ని పెద్ద నగదు నోట్లు రద్దుపై కొన్ని ప్రశ్నలు అడిగింది.అయితే ఈ ప్రశ్నలకు సమాదానం ఇవ్వకుండా ఆర్ బి ఐ తప్పించుకొంది.పైగా ప్రాణాలకు ముప్పు, దేశ భద్దత అంటూ సమాధానాలను చెప్పకుండా దాటవేత వైఖరిని అవలంభించింది. కొన్ని ప్రశ్నలకు సమాధానాలనే ఇవ్వలేదు. మరో వైపు ఒక ప్రశ్నకు రెండు వేర్వేరు సమాధానాలను ఇచ్చారు. నోట్ల రద్దు అనే నిర్ణయం ఎవరు తీసుకొన్నారనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. ఆర్ బి ఐ సమాధానాలు అనుమానాలకు తావిచ్చేలా ఉన్నాయి. మరో వైపు ప్రాణాలకు ముప్పు అంటూ సమాదానాలు ఇవ్వడం కూడ సంచలనంగా మారింది.
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎదుటైనా సమాధానం ఇస్తారా
ఈ నెల 20వ, తేదిన తమ ముందు హజరుకావాలని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఆర్ బి ఐ ని ఆదేశించింది. పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత ఏ మేరకు నల్లధనం నిర్మూలించబడింది. పెద్ద నగదు నోట్ల రద్దుకు ముందు, తర్వాత దేశంలో నెలకొన్న పరిస్థితులు ఏమిటనే విషయాలను పిఎసి ప్రశ్నించనుంది. సమగ్రసమాచారంతో సమావేశానికి హజరుకావాలని పిఎసి ఆదేశించింది.ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.అయితే రాజ్యసభ స్టాండింగ్ కౌన్సిల్ ఎదుట హజరైన ఆర్ బి ఐ అధికారులుసరైన సమాధానం చెప్పలేదనే విమర్శలు కూడ వచ్చాయి.
ఆర్ బి ఐ ఏం సమాధానమిచ్చింది
గత ఏడాది డిసెంబర్ 8వ, తేది నుండి జనవరి రెండవ తేది వరకు బ్లూమ్ బర్గ్ న్యూస్ సమాచార చట్టం కింద ఆర్ బి ఐ ని 14 ప్రశ్నలను అడిగింది. ఇందులో ఐదు ప్రశ్నలకు మాత్రమే ఆర్ బి ఐ సమాధానం ఇచ్చింది. ఈ సమాధానాన్ని ఈ నెల 11వ, తేదిన బ్లూమ్ బర్గ్ న్యూస్ కు పంపింది. నోట్ల రద్దుపై ఎప్పుడు నిర్ణయం తీసుకొన్నారనే విషయాన్ని వెల్లడించింది. కాని, కమర్షియల్స్ బ్యాంకుల్లో ఎంత మొత్తం డిపాజిట్ అయిందనే ప్రశ్నకు తమ దగ్గర సమాధానం లేదని ఆర్ బి ఐ తేల్చి చెప్పింది.
ప్రాణాలకు ముప్పుందన్న ఆర్ బి ఐ
పెద్ద నగదు నోట్లు రద్దు అంశాన్ని ప్రకటించే సాయంత్రానికి బ్యాంకుల్లో ఎన్ని రద్దుచేసిన నోట్లున్నాయనే విషయమై వింత సమాధానాలను ఆర్ బి ఐ ఇచ్చింది. ఈ ప్రశ్నకు మినహయింపు ఇవ్వాలని కోరింది. ఈ సమాధానం చెప్పిన వ్యక్తి ప్రాణాలకు ముప్పుందని ఆర్ బి ఐ స్పష్టం చేసింది. నోట్ల రద్దుకు తమ సంసిద్దత, పరిణామాలపై అధ్యయనానికి సంబంధించినప్రశ్నలకు కూడ మినహాయింపులు ఇవ్వాలని కోరింది ఆర్ బి ఐ.
విభిన్న సమాధానాలు
కొత్త నోట్ల ముద్రణకు సంబంధించిన రెండు ప్రశ్నలకు సంబందించిన సమాచారం తమ వద్ద లేదని, ఈ సమాచారాన్ని ఆయా ప్రింటింగ్ ప్రెస్ ల నుండి తీసుకోవాలని కోరింది ఆర్ బి ఐ. నోట్ల రద్దుపై ఎందుకు ఆర్ బి ఐ బోర్డులో చర్చించి ఆమోదించలేదన్న ప్రశ్న సమాచారహక్కు చట్టం పరిధిలోకి రాదని తేల్చి చెప్పింది. ప్రశ్న మూడు సార్లు అడిగితే , ఈ ప్రశ్నకు వేర్వేరుగా సమాధానాలు చెప్పింది ఆర్ బి ఐ, పెద్ద నగదు నోట్ల రద్దుపై ఎంతమంది బోర్డు సభ్యులు ఈ నిర్ణయాన్ని ఆమోదించారన్న ప్రశ్నకు ఒకసారి ఏకగ్రీవమని, మరో సారి ఈ సమాచారం తమ వద్ద లేదని ఆర్ బి ఐ చెప్పింది.