కర్నాటక ఆలయం విషాద ఘటన: ప్రసాదంలో ఏమి కలిపారో తెలుసా..?
కొద్దిరోజుల క్రితం కర్నాటకలోని చామరాజనగర్ జిల్లాలో ఆలయ ప్రారంబోత్సవం సందర్భంగా ప్రసాదం సేవించిన భక్తులు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. సోమవారం నాటికి మృతుల సంఖ్య 14కు చేరింది. ఇంత మంది పొట్టనబెట్టుకున్న ప్రసాదంలో ఏమి కలిసిందో తెలుసుకునేందుకు ప్రసాదం శాంపిల్స్ను పరీక్ష కోసం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు అధికారులు. భక్తులు సేవించిన ప్రసాదంలో విషపదార్థం కలిసిందని ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్టు ఆధారంగా ప్రకటించింది కర్నాటక ప్రభుత్వం.
ప్రసాదంలో పంటను నాశనం చేసే పురుగుల మందు కలిసిందని కర్నాటక డిప్యూటీ సీఎం పరమేశ్వర తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఏడుగురిని పోలీసులు అరెస్టు చేసినట్లు చెప్పారు పరమేశ్వర. మరికొందరు అనుమానితులు గ్రామాన్ని వదిలి వెళ్లిపోయారని వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని చెప్పిన పరమేశ్వర... ఈ దారుణానికి పాల్పడింది ఎవరనేది త్వరలోనే తెలుస్తుందన్నారు. మరో రెండురోజుల్లో పూర్తి వివరాలు బయటకు వస్తాయని చెప్పారు.
ఆలయం ప్రారంభోత్సవ సందర్భంగా అక్కడికి వచ్చిన భక్తులకు ప్రసాదంగా వెజిటెబుల్ రైస్ వడ్డించారు. మొత్తం 150 మందికి పైగా భక్తులు హాజరయ్యారు. ప్రసాదం సేవించిన అరగంటకే భక్తులు వాంతులు చేయడం మొదలు పెట్టారు. అనారోగ్యానికి గురైయ్యారు. వెంటనే చికిత్స కోసం బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన రోజున 11 మంది మృతి చెందగా ఆ తర్వాత మరో ఇద్దరు సోమవారం ఒకరు మృతి చెందారు. ఇదిలా ఉంటే ప్రసాదంలో విషం కలపాలన్న కుట్ర ముందస్తు ప్రణాళికగా ఆరోపించారు కర్నాటక ప్రధాన ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప.