బెంగళూరులో సత్తాచాటిని తెలుగింటి అమ్మాయిలు: 95 శాతం మార్కులు !
పోట్టకూటికోసం ఆంధ్రప్రదేశ్ నుంచి పొరుగు రాష్ట్రంలోని బెంగళూరు నగరానికి వచ్చిన చేనేత కార్మికుల పిల్లలు పీయూసీ పరీక్షల్లో 95 శాతం మార్కులు సాధించి తెలుగువారి సత్తాచాటారు.
బెంగళూరు: పోట్టకూటికోసం ఆంధ్రప్రదేశ్ నుంచి పొరుగు రాష్ట్రంలోని బెంగళూరు నగరానికి వచ్చిన చేనేత కార్మికుల పిల్లలు పీయూసీ పరీక్షల్లో సత్తాచాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించినందుకు వారి రుణం తీర్చుకోవడానికి ఆ ఇద్దరూ విద్యార్థులు ప్రయత్నించారు.
పొరుగు రాష్ట్రంలో బాష ఏదైనా వారి చదువుకు అడ్డురాలేదు. కష్టపడి ఎక్కడైనా చదవగలం అని ఇద్దరు చేనేత కార్మికుల పిల్లలు నిరూపించారు. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు చెందిన చేనేత కార్మికుడు వెంకటరమణారెడ్డి, సుజాత దంపతులు బెంగళూరు చేరుకుని యలహంకలోని కామాక్షిపాళ్యలో నివాసం ఉంటున్నారు.
వెంకటరమణ, సుజాత దంపతుల కుమర్తె ధరణి పీయూసీ (ఇంటర్) ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసింది. మరో చేనేత కుటుంబానికి చెందిన రవిశంకర్, సుజాత దంపతుల కుమార్తె శ్రీవాణి పీయూసీ ద్వితీయ పరీక్షలు రాసింది. కర్ణాటక విద్యార్థులతో పోటీపడి వీరు పరీక్షలు రాశారు.
ధరణి, శ్రీవాణిలు ఇద్దరూ 95 శాతం మార్కులు సాధించి తెలుగువారి సత్తాచాటారు. పీయూసీ ద్వితీయ సంవత్సర పరీక్షల్లో వీరిద్దరూ 600 మార్కులకు గాను 570 మార్కులు సాధించి సత్తాచాటారు. కష్టపడి చదివించినందుకు మాపిల్లలు అత్యధిక మార్కులు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని ధరణి, శ్రీవాణి కుటుంబ సభ్యులు అంటున్నారు.