చంద్రయాన్ 1 సమాచారం: చంద్రుడిపై నీరు ఉన్నట్లు ధృవీకరించిన శాస్త్రవేత్తలు
చంద్రుడిపై ఘనీభవించిన నీటి నిక్షేపాలు చంద్రయాన్-1 స్పేస్ క్రాఫ్ట్ కనుగొన్నట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ నీటి నిక్షేపాలు చంద్రుడిపై అత్యంత చల్లగా, చీకటిలో ఉండే ప్రాంతాల్లో గుర్తించినట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. అక్కడ మంచు దర్శనం ఇవ్వడంతో ఇక చంద్రుడిపై నీరు దొరుకుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. భవిష్యత్తులో చంద్రుడిపై మరిన్ని విషయాల గూర్చి అణ్వేషించేందుకు ఉపయోగపడుతుందని వారు తెలిపారు. చంద్రుడి కింద కూడా నీటి ఆనవాలు గతంలోనే గుర్తించినప్పటికీ అది అందుబాటులోకి తీసుకురావాలంటే చాలా కష్టమని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇది చంద్రుడి ఉపరితలంపై లభించడంతో ఇది కొంత సులభతరం అవుతుందని వారు వివరించారు.
చంద్రుడి దక్షిణ ధృవం వద్ద చాలామటుకు మంచు లూనార్ క్రేటార్స్ వద్ద కేంద్రీకృతమై ఉండగా... ఉత్తర ధృవం వద్ద మాత్రం అక్కడక్కడ మంచు కనిపించిందని శాస్త్రవేత్తలు చెప్పారు. నాసాకు చెందిన మూన్ మినియరాలజీ మ్యాపర్ పరికరం వినియోగించిన శాస్త్రవేత్తలు చంద్రుడి ఉపరి తలంపై కచ్చితంగా నీటి ఆనవాలు ఉన్నాయని తేల్చారు. భారత్ ప్రయోగించిన చంద్రయాన్ -1 స్పేస్ క్రాఫ్ట్లో M3 పరికరాన్ని అమర్చారు. ఇదే చంద్రుడిపై నీటి ఆనవాలు ఉన్నట్లు గుర్తించింది.
ప్రస్తుతం గుర్తించిన నీటి ఆనవాలు ఎక్కువగా ధృవ ప్రాంతాల్లోనే ఉన్నాయని తెలిపిన శాస్త్రవేత్తలు, అక్కడ ఉష్ణోగ్రత మైనస్ 156 డిగ్రీల సెల్సియస్ కంటే ఎప్పుడూ ఎక్కువగా లేదని తెలిపారు. చంద్రుడి భ్రమణ అక్షం చాలా తక్కువగా ఉండటంతో సూర్య కిరణాలు ఈ ప్రాంతాన్ని తాకవని దీంతో ఇక్కడ ఎప్పుడూ చీకటిగా ఉండటంతో పాటు చాలా చల్లగా కూడా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. గత పరిశీలనలో చంద్రుడి ధృవప్రాంతాల్లో నీటి జాడలు ఉండొచ్చు అని చెప్పిన శాస్త్రవేత్తలు ఇప్పుడు ఆ నీటి జాడలు ఉన్నట్లు ధృవీకరించారు.
మొత్తానికి మంచు చంద్రుడిపై ఎలా ఏర్పడింది, అక్కడికి ఎలా వచ్చింది, చంద్రుడిపై ఇంకేమున్నాయి అని బాహ్య ప్రపంచానికి చెప్పడం నాసాతో పాటు ఇతర వాణిజ్య పరిశ్రమలకు పెద్ద సవాలుగా మారింది. ఎందుకంటే మానవుడు చంద్రుడిపై అడుగుపెట్టి మరిన్ని అన్వేషణలు చేసేందుకు ఈ ప్రయోగాలు ఉపయోగపడుతాయి.