Crime News:తల్లిని హత్య చేసింది.. ప్రియుడితో అండమాన్ చెక్కేసింది..కథలో ట్విస్టులు
బెంగళూరు: దేశ ఐటీ రాజధాని బెంగళూరు నగరంలో దారుణం చోటుచేసుకుంది. కన్నతల్లినే ఓ కూతురు కడతేర్చిన విషయం కలకలం సృష్టించింది. తల్లిని కత్తితో పొడిచి ప్రియుడితో అండమాన్కు పారిపోయింది. యువతిని పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. అయితే తల్లిని ఎందుకు చంపాల్సి వచ్చిందో దీని వెనక కథ ఏమిటనేదానిపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తల్లిని తమ్ముడిని కత్తితో పొడిచిన అమృత
ఫిబ్రవరి 2వ తేదీన బెంగళూరులో దారణ హత్య జరిగింది. తన తల్లి నిర్మలాను కూతురు అమృత దారుణంగా పొడిచి హత్య చేసింది. తల్లితో పాటు తన తమ్ముడు హరీష్ను కూడా పొడిచింది. ఇద్దరు అపస్మారక స్థితిలోకి జారుకున్నారని నిర్థారించుకున్న తర్వాత కొద్ది దూరంలో బైకుపై వేచిచూస్తున్న తన ప్రియుడు శ్రీధర్ రావు దగ్గరకు వెళ్లింది. అక్కడి నుంచి ఇద్దరూ బెంగళూరు విమానాశ్రయంకు వెళ్లి అక్కడి నుంచి విమానంలో పోర్ట్బ్లెయిర్కు వెళ్లారు. తల్లిని పొడవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కానీ తమ్ముడు హరీష్ మాత్రం అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు.
మానసిక కారణాలతోనే హత్య
ఓ గంట తర్వాత మెలుకువలోకి వచ్చిన హరీష్ సహాయం కోసం అర్థించాడు. ఇక అండమాన్ నుంచి అమృత శ్రీధర్లకోసం వేచిచూస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హరీష్ చెబుతున్నట్లు వర్షన్ కాస్త గందరగోళానికి గురిచేస్తోందన్నారు. అయితే ఆర్థికపరమైన విబేధాలతోనో, లేక కక్షకార్పణ్యాలతోనే హత్య చేయలేదని ఏదో మానసికంగా డిస్టర్బ్ అవడంతోనే హత్య చేసి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో అమృత అసహనానికి గురైనట్లు సమాచారం. 2013లో అమృత తండ్రి ఊపిరితిత్తుల క్యాన్స్ర్తో బాధపడినప్పుడు ఆయన చికిత్స కోసం రూ.4 లక్షలు అప్పు చేసింది. అయితే తీసుకున్న రూ. 4 లక్షలు చెల్లించలేకపోయారు. దీంతో వడ్డీ భారం పడి మొత్తం రూ.18 లక్షలకు చేరుకుంది.
ముందుగా తల్లిని తమ్ముడిని చంపి ఆ పై తాను కూడా..
అయితే ఈ అప్పుల ఊబిలో తన కుటుంబం కూరుకుపోవడం ఇష్టం లేదని భావించిన అమృత.. తల్లిని, తమ్ముడిని చంపి అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు సమాచారం. అయితే తన ప్రియుడితో అండమాన్ వెళ్లాలని ముందుగానే నిర్ణయించుకోవడంతో అక్కడి నుంచి వచ్చాక తాను ఆత్మహత్య చేసుకుందామనే ఆలోచనలో అమృతా ఉండి ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే ప్రియుడు శ్రీధర్కు తెలిసే ఈ ఘాతుకం జరిగిందా లేక ఈ విషయం గురించి అమృత అస్సలు చెప్పలేదా అనేది కూడా తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. 2017వరకు అమృతా, శ్రీధర్లు ఒకే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేశారు. అమృత ఉద్యోగం మానేసింది. ఇక అప్పటి నుంచి ఆమె ఏ ఉద్యోగంలో చేరలేదు. అమృత తమ్ముడు హరీష్ కూడా ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
శ్రీధర్ ఫోన్ ఆధారంగా పట్టుకున్న పోలీసులు
హత్య జరిగిన రోజున తెల్లవారు జామున శబ్దం వస్తుండటంతో హరీష్ నిద్రలేచినట్లు పోలీసులకు చెప్పాడు. అయితే ఏంటని అడుగగా తాను ఓ టూర్కు వెళుతున్నట్లు అమృతా చెప్పిందని వెల్లడించాడు. కొన్ని క్షణాలకే తల్లిని కత్తితో పొడిచి చంపిందని హరీష్ చెప్పాడు. అనంతరం తనను కూడా పొడిచిందని చనిపోయి ఉంటానని భావించి అక్కడి నుంచి పారిపోయినట్లు హరీష్ చెప్పాడు. ఉదయం 5 గంటల ప్రాంతంలో తన బంధువులకు ఫోన్ చేసి చెప్పినట్లు హరీష్ వెల్లడించాడు. శ్రీధర్ రావు ఫోన్ ఆధారంగా వారు ఇద్దరూ అండమాన్లో ఉన్నట్లు పోలీసులు కనిపెట్టారు. అయితే హత్య విషయం తెలిసి ఉంటే శ్రీధర్ రావు ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేవాడని అయితే తనకు ఈ హత్య గురించి అమృత చెప్పి ఉండకపోవచ్చని పోలీసులు చెబుతున్నారు. వారి అండమాన్ ట్రిప్ ఎప్పుడో ప్లాన్ అయ్యిందని టికెట్లు కూడా ముందుగానే బుక్ చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు ఇద్దరూ మూడురోజుల పాటు అండమాన్లో ఉన్న సమయంలో అమృతలో ఏమైనా మార్పులు కనిపించాయా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేయనున్నారు.