కైరానా వలసలు: కూతురు వర్సెస్ మేనల్లుడు
గత ఏడాది జూన్లో వెలుగుచూసిన కైరానా వలసల వివాదం బిజెపికి సంకటంగా మారింది. ప్రత్యేకించి కైరానా లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన బిజెపి ఎంపి హుకుం సింగ్ సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
లక్నో: గత ఏడాది జూన్లో వెలుగుచూసిన కైరానా వలసల వివాదం బిజెపికి సంకటంగా మారింది. ప్రత్యేకించి కైరానా లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన బిజెపి ఎంపి హుకుం సింగ్ సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. గత ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో అధికార సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నది. హిందువులు భారీగా వలసలు వెళ్లారన్న ఆరోపణలతో వివాదాస్పదం చేసిన కమలనాథులకు మద్దతు లభించడం కష్ట సాధ్యంగా పరిణమించింది.
ఇటువంటి పరిస్థితుల్లో తన కూతురు మ్రిగంకాకు కైరానా అసెంబ్లీ స్థానం టిక్కెట్ సాధించుకున్న హుకుంసింగ్ ఆమె తరఫున ఎన్నికల ప్రచార సారథ్యం చేపట్టారు. ఈ నెల 11న తొలిదశ పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో ఇదొకటి. హుకుంసింగ్ కూతురుకు ప్రత్యర్థిగా ఆయన మేనల్లుడు అనిల్ చౌహాన్ పోటీ చేయడమే హుకుంసింగ్కు ఇబ్బందికరంగా మారింది. ఆయన తనకు స్థానిక బిజెపి కార్యకర్తల మద్దతు ఉన్నదని చెప్తున్నారు. గత ఏడాది వరకు మేనమామ హుకుం సింగ్కు బాసటగా నిలిచిన అనిల్ చౌహాన్.. గత ఏడాది హుకుంసింగ్ 'కైరానా వలసల సిద్ధాంతం' తీసుకురాగానే రూట్ మార్చారు. తన కూతురుకు టిక్కెట్ ఖరారుచేసుకోవడానికే ఈ వివాదాన్ని ముందుకు తెచ్చారని అనిల్ చౌహాన్ పేర్కొన్నారు.
గత ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లోనూ అనిల్ చౌహాన్ బిజెపి అభ్యర్థిగా కైరానా నుంచి పోటీ చేసి.. ఎస్పీ అభ్యర్థి నాహిద్ హసన్ చేతిలో కేవలం 1,100 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. నాటి పరిణామాలతో దిగ్భ్రాంతికి గురైన అనిల్ చౌహాన్ ఈ దఫా కూడా బిజెపి తనకే టిక్కెట్ ఇస్తుందని ఆశించారు. కానీ ఆయన ఆశలు అడియాసలయ్యాయి. బిజెపి అభ్యర్థుల జాబితా ప్రకటించిన మరుసటి రోజే రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) పార్టీ తీర్థం పుచ్చుకున్నారు అనిల్ చౌహాన్. 'దీర్ఘకాలంగా నేను బాబూజీ (సింగ్)ను వెన్నంటి వచ్చా. కానీ ఆ పార్టీ నాయకత్వం తీరు బాగోలేదు.
గత ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో యావత్ రాష్ట్ర ప్రభుత్వం నాకు వ్యతిరేకంగా వ్యవహరించడంతో ఎస్పీ అభ్యర్థి నాహిద్ హసన్ చేతిలో కేవలం 1,100 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాను. బిజెపి నాయకత్వం ఆశ్రితపక్షపాతానికి ప్రాధాన్యం ఇస్తూ నన్ను మోసగించింది' అని ఆరోపించారు.కైరానా వలసలు కేవలం ఒక అంశమే తప్ప మతానికి సంబంధం లేదని, సహజ సిద్ధమైన ఘటన అని అనిల్ చౌహాన్ వ్యాఖ్యానించారు. ఒకవేళ చారిత్రక కారణాలు ఉంటే హుకుంసింగ్ గతంలో అసెంబ్లీలో ఎందుకు లేవనెత్తలేదని ప్రశ్నించారు. కేవలం కూతురుకు టిక్కెట్ ఇప్పించుకోవడానికే ఈ వివాదాన్ని ముందుకు తెచ్చారు. అది చాలా ముఖ్యమైనదైతే 1974కు ముందు పార్లమెంట్ లో ప్రస్తావనెందుకు లేదని నిలదీశారు.
కైరానా వలసలకు కారణం అనేకమన్న హుకుంసింగ్
కానీ హుకుంసింగ్ వాదన మరోలా ఉంది. పార్టీ నాయకత్వం బిజెపిలో సరైన, ప్రజాదరణ గల నాయకులకే టిక్కెట్లిచ్చిందంటారు. వలసల వివాదం బలహీన పడుతుందన్న చౌహాన్ వాదనను హుకుంసింగ్ కొట్టి పారేశారు. 15 రోజుల క్రితం వరకు ఈ వివాదంపై తనకు మద్దతుగా నిలిచిన తన మేనల్లుడు ఇప్పుడు తన వైఖరి మార్చుకున్నాడని హుకుంసింగ్ ఆరోపిస్తారు. ఆయన వైఖరిని కైరానా ఓటర్లు అర్థం చేసుకుంటారని చెప్పారు.
కైరానా నుంచి ప్రజలు వలస వెళ్లడానికి చాలా కారణాలు ఉన్నాయని హుకుం సింగ్ కూడా అంగీకరించారు. కైరానా నుంచి పురాతన కాలంలో ఒక సామాజిక వర్గం నుంచి వచ్చే బెదిరింపులను ఎదుర్కోలేక 300లకు పైగా హిందువులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని గత ఏడాది జూన్ నెలలో ఒక జాబితా విడుదల చేశారు. కానీ ఆయా కుటుంబాల్లో అత్యధికం కేవలం మెరుగైన ఉపాధి, ఉన్నత విద్యాభ్యాసం కోసం వలస వెళ్లారని ఓ అధ్యయనంలో తేలింది.
బిజెపిలో కుమ్ములాటలతో లబ్దిపై హసన్ ఆశలు
పోలింగ్కు మరో నాలుగు రోజుల గడువు మాత్రమే ఉన్నా.. బిజెపిలో అంతర్గత కుమ్ములాటలు తమకు లబ్ది చేకూరుస్తాయని ఎస్పీ అభ్యర్థి నాహిద్ హసన్ దీమా వ్యక్తం చేశారు. మరోసారి విజయంపై ఆశలు పెట్టుకున్నారు. గురువారం కైరానాలో జరిగే ఎన్నికల ప్రచార సభలో సీఎం అఖిలేశ్ యాదవ్ కొన్ని వాగ్దానాలు చేసే అవకాశం ఉన్నదని తెలిపారు. 2.7 లక్షల మంది ఓటర్లు గల కైరానాలో 1.3 లక్షల మంది ముస్లింలే ఉన్నారు.
మిగతా వారిలో 25 వేల చొప్పున గుజ్జర్లు, జాట్లు, కాశ్యప్ సామాజిక వర్గాల వారు ఉన్నారు. అనిల్ చౌహాన్ సన్నిహత వర్గాల కథనం ప్రకారం ఒక గుజ్జార్ నేతగా విజయం సాధించడానికి పోటీ చేస్తున్నారని సమాచారం. ఆర్ఎల్డీ పార్టీ నుంచి పోటీచేస్తున్నందున జాట్ల ఓట్లు తనకే లభిస్తాయని ఆయన ఆశిస్తున్నారు. ప్రస్తుతం ముస్లింల మద్దతు కూడా పొందుతున్నందున తమ నాయకుడు అనిల్ చౌహాన్ ఓటమి పాలయ్యే అవకాశమే లేదని ఆయన సన్నిహితులు చెప్తున్నారు.
విద్యుత్ కోతలే ఎజెండా.. రామమందిరం ప్లస్ కైరానా కాదు
కైరానా నియోజకవర్గ పరిధిలో ప్రధానంగా విద్యుత్ కోతల నుంచి పరిష్కారం కావాలని స్థానికులు కోరుతున్నారు. గూండా రాజ్యానికి చరమ గీతం, నోట్ల రద్దు అంశాలు ఎన్నికల ప్రచారాస్త్రాలుగా మారినా ప్రధాన సమస్య విద్యుత్ కోతలేనంటున్నారు. నియోజకవర్గ పరిధిలో సుమారు 30 శాతం మంది విద్యుత్ సమస్య పరిష్కారం కావాలని కోరుతున్నారు. 20 శాతం మంది ఉపాధి కోసం, మరి కొందరు ప్రగతి, 10 శాతం మంది నీటి కొరత సమస్య పరిష్కారం కావాలని కోరుతున్నారు.
కైరానాలో ఎస్పీ - కాంగ్రెస్ కూటమితోపాటు బీఎస్పీ, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. జన గణన ప్రకారం పట్టణ ప్రాంత వాసులు 81.4% మంది ప్రజలు విద్యుత్ వాడుతున్నారు. కానీ గ్రామాల్లో మాత్రం 23.7 శాతం మందికి మాత్రమే విద్యుత్ అందుబాటులో ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లోని 1.77 కోట్ల కుటుంబాలకు విద్యుత్ అందుబాటులో లేదు. 38 శాతం మంది విద్యుత్ కోత ఎదుర్కొంటున్నామని, మరో 16 శాతం మంది వారానికోసారి ఈ సమస్య తలెత్తుతున్నదని చెప్పారు.