డబ్బుల కోసమే ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చాడు: దవేందర్ సింగ్ విచారణలో వెలుగులోకి పలు అంశాలు
న్యూఢిల్లీ: ఉగ్రవాదులను తరలిస్తూ శ్రీనగర్ చెక్ పోస్టు దగ్గర పట్టుబడ్డ మాజీ పోలీస్ అధికారి దవేందర్ సింగ్ను విచారణాధికారులు విచారణ చేస్తున్నారు. అయితే ఈ విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులను దాటించేందుకు ఆయన డబ్బులు తీసుకున్నట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. అంతేకాదు ఉగ్రవాద సంస్థల నుంచి నెల నెలా డబ్బులు పొందేవాడని అవి తీసుకుని ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించేవాడని విచారణలో వెల్లడైనట్లు సమాచారం.
ఉగ్రవాదులను జమ్మూకు దవేందర్ తీసుకెళ్లాడని
దవేందర్ సింగ్ను విచారణ చేస్తున్న ఎన్ఐఏ అధికారులు మరికొన్ని విషయాలను రాబట్టారు. గతేడాది హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులను జమ్మూకు దవేందర్ తీసుకెళ్లాడని ఆ తర్వాత షోపియన్కు తరలించాడని విచారణలో ఒప్పుకున్నట్లు సమాచారం. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు నవీద్ బాబు, మీర్ ఇర్ఫాన్, రఫిలను షోపియన్ నుంచి శ్రీనగర్కు ఈ నెల ప్రారంభంలో తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి జమ్మూకు తరలించి ఆపై ఢిల్లీకి పంపాలన్న ప్లాన్ వేసినట్లు సమాచారం. అయితే మధ్యలోనే పోలీసులు పట్టుకోవడంతో వారి వ్యూహం భగ్నమైంది.
విచారణ సందర్భంగా
ఇదిలా ఉంటే ముందుగా దవేందర్ సింగ్ బుకాయించాడు. వారిని పోలీసులకు సరెండర్ చేసేందుకే పథకం ప్రకారం వారితో కలిసి ప్రయాణించినట్లు దవేందర్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలే అని దవేందర్ సింగ్ విచారణ సందర్భంగా చెప్పినట్లు సమాచారం. ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారీ వ్యూహాన్ని రచించినట్లు దవేందర్ సింగ్ చెబుతున్నప్పటికీ... అతను చెబుతున్న దానికి జరగుతున్నదానికి ఎక్కడా పొంతన కుదరడం లేదని అధికారులు చెప్పారు. అంతేకాదు దవేందర్ సింగ్ ఉగ్రవాద సంస్థల నుంచి డబ్బులు తీసుకుని బనిహాల్ టన్నెల్ను దాటించేవాడని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం రూ.10 లక్షలు డబ్బులు తీసుకునేవాడని చెప్పుకొచ్చారు. సింగ్ మాత్రం నిజాలు చెప్పడం లేదని, ఉగ్రవాదులను సరెండర్ అవ్వాలని చెప్పే అధికారం కూడా తనది కాదని విచారణాధికారులు చెబుతున్నారు.
ఇక దవేందర్ సింగ్ పై
ఇక దవేందర్ సింగ్ పై అనుమానం రావడంతో గత కొద్ది రోజులుగా అతనిపై నిఘా వేసి ఉంచామని చెప్పిన పోలీసులు.. అతని నివాసం వద్ద కూడా పోలీసులను మఫ్టీలో ఉంచినట్లు చెప్పారు. మరోవైపు అఫ్జల్ గురుతో ఉన్న సంబంధాలపై కూడా ఎన్ఐఏ ఆరా తీస్తోంది. అయితే ప్రస్తుతం దవేందర్ సింగ్ను అరెస్టు చేసినట్లు చెప్పిన ఐజీ విజయ్ కుమార్... ఉగ్రవాదుల్లానే దవేందర్ను చూస్తామని చెప్పారు.