పాకిస్తాన్ అబద్ధాలకోరు, మాఫియా డాన్ దావూద్ అక్కడే, మరోసారి వెల్లడైన నిజం
పాకిస్తాన్ బండారం మరోసారి బట్టబయలైంది. ఇన్నాళ్లూ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం తమ దేశంలో లేడని పాక్ బుకాయించినప్పటికీ, అదంతా ఉత్తదేనని తేలిపోయింది.
ముంబై: పాకిస్తాన్ బండారం మరోసారి బట్టబయలైంది. ఇన్నాళ్లూ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం తమ దేశంలో లేడని పాక్ బుకాయించినప్పటికీ, అదంతా ఉత్తదేనని తేలిపోయింది.
ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లోనే ఉన్నాడని అతని తమ్ముడు ఇక్బాల్ కస్కర్ పోలీసులకు వెల్లడించాడు. ప్రస్తుతం ముంబై పోలీసుల కస్టడీలో ఉన్న కస్కర్.. విచారణలో పలు విషయాలను వెల్లడించాడు.
దావూద్ పశ్చిమ, తూర్పు ఆఫ్రికా దేశాల్లో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు తెలిపాడు. అంతేకాదు పాకిస్తాన్ లోనే ఉన్న దావూద్.. ఇండియాలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాలుగుసార్లు తన స్థావరాలను మార్చాడని కూడా వెల్లడించాడు.
పాక్లో దావూద్కు భద్రత కూడా పెంచారని ఇక్బాల్ చెప్పాడు. అతను కుటుంబ సభ్యులతోనూ ఫోన్లో మాట్లాడడని ఇక్బాల్ కస్కర్ తెలిపాడు. అంతర్జాతీయ ఉగ్రవాది అయిన దావూద్కు లాటిన్ అమెరికా డ్రగ్ స్మగ్లర్స్తో సంబంధాలు ఉన్నాయని కూడా వెల్లడించాడు.
రియల్టర్లను బెదిరించి 30 లక్షలు, నాలుగు ఫ్లాట్లను డిమాండ్ చేసిన ఇక్బాల్ను రెండు రోజుల కిందట పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ వసూళ్ల వెనుక దావూద్ పాత్ర ఉందా? అన్న కోణంలో ఇక్బాల్ను పోలీసులు విచారిస్తున్నారు.
దావూద్ చెల్లెలు హసీనా పార్కర్ ఇంట్లో ఉండగా ఇక్బాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2003లో యూఏఈ నుంచి వచ్చిన ఇక్బాల్.. అప్పటి నుంచి దావూద్ రియల్ ఎస్టేట్ బిజినెస్ను చూసుకుంటున్నాడు.
1993 ముంబై పేలుళ్ల నిందితుడైన దావూద్.. అప్పటి నుంచీ పాకిస్తాన్ లోనే ఉన్నాడు. ఈ విషయాన్ని ఇండియా పదే పదే చెబుతున్నా.. పాక్ మాత్రం అతడు తమ దేశంలో లేడంటూ బుకాయిస్తోంది.
ఈ మధ్యే పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కూడా దావూద్ పాక్లోనే ఉన్నా.. భారత్ కు అప్పగించాల్సిన అవసరం లేదని చెప్పిన విషయం తెలిసిందే.