లొంగిపోతా.. కానీ ఒక్క షరతు: దావూద్, తమ్ముడు చెప్పిన సంచలనం..
ముంబై: భారత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం గతంలోనే లొంగిపోతానని చెప్పాడా?.. అయితే దావూద్ పెట్టిన షరతులకు భారత్ ఒప్పుకోకపోవడం వల్లే అతను లొంగిపోలేదా?.. దావూద్ తమ్ముడు కస్కర్ మాత్రం అవుననే అంటున్నాడు.
దావూద్ తమ్ముడి కేసు విచారణలో:
ఓ కేసు విచారణలో భాగంగా కస్కర్ను థానె పోలీసులు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆర్వీ థమదేకర్ ఎదుట హాజరు పరిచారు. కేసుపై విచారణ జరుగుతున్న క్రమంలోనే.. తాను దావూద్ ఇబ్రహీంతో మాట్లాడానని కస్కర్ ఒప్పుకున్నాడు. కస్కర్ తరుఫు న్యాయవాది శ్యాం కేస్వాని ఈ విషయాలను వెల్లడించారు.
Recommended Video
ఆ ఒక్క షరతుతో..:
'దావూద్ న్యాయవాది రాంజెఠ్మలానికి చాలా స్పష్టంగా చెప్పారు. మీరు భారత ప్రభుత్వంతో మాట్లాడితే నేను లొంగిపోవడానికి సిద్దం. నేనెక్కడున్నా అనేదానితో సంబంధం లేకుండా.. ముంబై వచ్చి లొంగిపోతా. నన్ను అరెస్ట్ చేయండి, కానీ ఒక షరతు. నన్ను అర్థుర్ రోడ్డులోని జైల్లో మాత్రమే ఉంచాలి. ఏ కేసులోనైనా విచారించండి.. కానీ అక్కడినుంచే అన్నీ జరగాలి' అని దావూద్ గతంలో తెలియజేసినట్టు కేశ్వాని తెలిపారు.
భారత్ ఒప్పుకోలేదు..:
దావూద్ పెట్టిన షరతులకు భారత ప్రభుత్వం ఒప్పుకోనందువల్లే అతను లొంగిపోలేదని కూడా కేశ్వాని తెలిపారు. తాను ఏ కేసునైనా ఎదుర్కోవడానికి సిద్దపడే ముంబై వచ్చి లొంగిపోతానని చెప్పాడని, కానీ అర్థుర్ జైల్లో పెడుతానంటే మాత్రమే ఇది జరుగుతుందని చెప్పినట్టు ఆయన వెల్లడించారు.
దావూద్ తమ్ముడిపై కేసు?:
దావూద్ సోదరుడు కస్కర్, అతని గ్యాంగ్ సభ్యులపై గతంలో ఓ దోపిడీ కేసు నమోదైంది. శ్యాం సుందర్ అగర్వాల్ అనే వ్యక్తి బోరివల్లిలో ప్లాట్ కొనుగోలు చేయగా.. అతన్ని బెదిరించిన కస్కర్.. ఫ్లాట్ మరొకరికి అప్పగించాడు. ఈ కేసు విచారణ సందర్భంగా దావూద్ విషయాలు బయటపడ్డాయి.
కాగా, ప్రస్తుతం కస్కర్ డయాబెటిస్ తో బాధపడుతున్నాడు. అతని కాలుకు గాయం కావడంతో మెడికల్ చికిత్స అవసరమని శ్యాం కేశ్వాని న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. దీంతో సివిల్ ఆసుపత్రిలో అతనికి పోలీసులు చికిత్స అందించాలని, మార్చి 9 వరకు కస్కర్ కస్టడీ కొనసాగుతుందని జడ్జి తెలిపారు.