దావూద్ ఇబ్రహీం స్థావరం ఎక్కడో తెలుసా? గుట్టువిప్పిన గ్యాంగ్స్టర్
దావూద్ ఇబ్రహీం.. అండర్ వరల్డ్ డాన్, కనుసైగలతో ప్రపంచాన్ని శాసిస్తోన్న గ్యాంగ్స్టర్.. ఎక్కడున్నారో తెలుసా..? పాకిస్థాన్లోని కరాచీలో.. అదీ కూడా ఐఎస్ఐ భద్రత మధ్య ఉన్నారని డీ-కంపెనీ మాజీ గ్యాంగ్స్టర్ ఎజాజ్ లక్డావాలా ఓ వార్తా సంస్థ కోట్ చేసింది. దీంతో దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్లో ఉన్నారనే అంశానికి మరోసారి బలం చేకూరింది. కానీ దాయాది పాకిస్థాన్ మాత్రం తమ వద్ద లేరని కుంటిసాకులు చెబుతోంది.
కరాచీలో మకాం..
పాకిస్థాన్లోని కరాచీలో దావూద్ ఇబ్రహీం ఉన్నారని ఎజాజ్ లక్డావాలా పేర్కొన్నారు. ఎజాజ్ను ముంబై క్రైం బ్రాంచ్ ఆంటి ఎక్ట్సోర్షన్ సెల్ (ఏఈసీ) పాట్నాలో అరెస్ట్ చేశారు. ముంబై తీసుకొచ్చి విచారిస్తున్న క్రమంలో నివ్వేరపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. కరాచీలోని రెండుప్రాంతాల్లో దావూద్ ఇబ్రహీం తలదాచుకుంటున్నారని ఎజాజ్ విచారణలో తెలిపారు.
ఐఎస్ఐ భద్రత
దావూద్ ఇబ్రహీంకు ఇంటర్ సర్వీసెస్ ఇంటిలెజెన్స్ (ఐఎస్ఐ) కమాండోల భద్రత ఇస్తున్నారని పేర్కొన్నారు. అయితే పాకిస్థాన్ ప్రధానమంత్రి, ఆర్మీ చీఫ్ ప్రమేయం లేకుండా మాత్రం దావూద్ ఇబ్రహీం కరాచీలో ఉండే అవకాశమే లేదని చెప్పారు. పాక్ పెద్దలకు తెలిసే ఇదంతా జరుగుతోందన్నారు. అనిస్, చోట షకీల్కు కూడా ఐఎస్ఐ గట్టి భద్రత కల్పిస్తోందని చెప్పారు. అంతేకాదు నకిలీ పాస్పోర్టులతో ఇతర దేశాలు పర్యటించేందుకు పాకిస్థాన్ సాయం చేస్తుందని ఎజాజ్ తెలిపారు.
డీ కంపెనీలో
ఎజాజ్ కూడా దావూద్ వద్ద పనిచేశాడు. కానీ తర్వాత వీడిపోయి చోటా రాజన్ ముఠాలో చేరిపోయాడు. 2002లో చోటా షకీల్ బ్యాంకాక్లో ఎజాజ్పై దాడి చేశాడు. గాయపడ్డ ఎజాజ్ థాయ్లాండ్ నుంచి సౌతాఫ్రికా పారిపోయాడు. తర్వాత కొన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న ఎజాజ్ 2008లో సొంతంగా ముఠా ఏర్పరచుకున్నారు.
వ్యాపారిని బెదిరిస్తూ..
పెద్దలను బెదిరిస్తూ సొమ్ముచేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వ్యాపారిని బెదిరించారని గతేడాది ఏప్రిల్లో ఎజాజ్ సోదరుడు అఖ్విల్ను కూడా ఏఈసీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఎజాజ్ అనుచరుడు సాగర్ యాదవ్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.