డౌట్ లేదు.. దావూద్ పాక్ లోనే ఉన్నాడు, ముషారఫ్ మాటలతో అనుమానం క్లియర్
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను బట్టి చూస్తే.. మాఫియా డాన్ దావూద్ పాకిస్తాన్ లోని కరాచీలోనే ఉన్నాడనే అనుమానాలను కలిగిస్తున్నాయి.
న్యూఢిల్లీ: 1993 ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అసలెక్కడ ఉన్నాడు? భారత్ ఆరోపిస్తున్నట్లుగా అతడు ఇన్నాళ్లూ పాకిస్తాన్ లోని కరాచీలోనే తలదాచుకున్నాడా? లేక దుబాయ్ లో ఉన్నాడా?
ఇటీవల ఓ టీవీ ఛానెల్ విలేకరి కరాచీలో ఉన్న దావూద్ తో నేరుగా టెలిఫోన్ ద్వారా మాట్లాడినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. తొలుత ఫోన్ లో మాట్లాడిన దావూద్ ఇబ్రహీం ఆ వెంటనే ఫోన్ ను తన అనుచరుడికి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయినా సరే పాకిస్తాన్ మాత్రం దావూద్ తమ దేశంలో లేడనే వాదిస్తోంది.
ఈ నేపథ్యంలో... పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను బట్టి చూస్తే.. మాఫియా డాన్ దావూద్ పాకిస్తాన్ లోని కరాచీలోనే ఉన్నాడనే అనుమానాలను కలిగిస్తున్నాయి.
పాకిస్తాన్ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముషారఫ్ మాట్లాడుతూ.. ''దావూద్ పాకిస్తాన్లో ఉన్నాడని భారత్ చాలాకాలంగా ఆరోపిస్తూనే ఉంది. ఒకవేళ అతడు ఇక్కడే ఉన్నా... అతని విషయంలో మేం భారత్కి ఎందుకు సాయం చేయాలి?'' అని ప్రశ్నించారు.
అంతేకాదు.. ''భారత్ ముస్లింలను చంపేస్తుంది. అందుకే దావూద్ భారత్ మీద పగతీర్చుకుంటున్నాడు..'' అంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. దావూద్ ఇబ్రహీం కరాచీలోనే ఉన్నాడంటూ గత పదేళ్లుగా భారత్ ఆరోపిస్తూనే ఉంది.
అల్ ఖాయిదా అధినేత బిన్ లాడెన్ విషయమే తీసుకుంటే.. అమెరికా రాత్రికి రాత్రే స్పెషల్ ఆపరేషన్ జరిపి పాకిస్తాన్ లోని అబోటాబాద్ లో దాగి ఉన్న లాడెన్ ను అంతమొందించిన విషయం తెలిసిందే. బిన్ లాడెన్ మాదిరిగానే దావూద్ ఇబ్రహీంకు కూడా పాకిస్తాన్ ఆశ్రయం కల్పించి ఉంటుందనేది భారత్ వాదన.