ఛోటా రాజన్ హత్యకు దావూద్ ప్లాన్! జైలులోనే అంతమొందించేందుకు డీ గ్యాంగ్ ప్రయత్నం!
న్యూఢిల్లీ: అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీమ్ మరో గ్యాంగ్స్టర్ ఛోటా రాజన్ హత్యకు ప్లానేశాడు. ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. తీహార్ జైల్లో ఉంటున్న ఛోటాను హత్య చేయాలని డీ గ్యాంగ్ తిరుగుతున్నట్లు సమాచారం.
తీహార్ జైలులోనే ఉంటున్న మరో గ్యాంగ్స్టర్ నీరజ్ బవానాకు చెందిన ఓ వ్యక్తి ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలకు వెల్లడించడంతో జైలులో భద్రతను పెంచాలని ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
గ్యాంగ్స్టర్ నీరజ్కు అనుబంధం ఉన్న అతను కూడా ఓ చిన్నపాటి ముఠా నాయకుడే. ప్రస్తుతం అతను బెయిల్పై బయట ఉన్నాడు. అతడు తాగిన మైకంలో ఫోన్లో మాట్లాడుతున్న సమయంలో ఈ అంశాలను పోలీసులు గుర్తించారు. ఆ తరువాత అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ విషయం బయటపడింది.
దాదాపు 20 ఏళ్ల నుంచి ఛోటా రాజన్ను హత్య చేయాలని డీ గ్యాంగ్ ప్లాన్ వేస్తోంది. దీని కోసం ఆ గ్యాంగ్ తీహార్ జైలులో శిక్ష పొందుతున్న బవానాను కూడా కలిసింది. గతంలో ఛోటా రాజన్, నీరజ్ బవానాలు ఒకే జైలులో ఉండేవారు.
ఇప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో వీరిద్దర్నీ వేరు చేశారు. గ్యాంగ్స్టర్ బవానా జైలు గదిలో కొన్ని మొబైల్ ఫోన్లను కూడా ఇటీవల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే తీహార్ జైలు అధికారులు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు.
బవానా కానీ, డీ గ్యాంగ్ కానీ ఛోటా రాజన్ దరిదాపులకు కూడా చేరలేరని, అతడి చుట్టూ ప్రత్యేకంగా స్పెషల్ గార్డ్స్ ఉన్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఛోటా రాజన్ తినే ఆహారం తయారీకి కూడా ప్రత్యేకంగా వంట చేసేవారిని నియమించారట.