దావూద్పై పార్లమెంట్లో ప్రకటన: భారత్కు రప్పిస్తామన్న హోం మంత్రి
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను త్వరలోనే భారత్కు రప్పిస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం లోక్సభలో ప్రకటించారు. దావూద్ పాకిస్ధాన్లోనే ఉన్నాడని తమ వద్ద సమాచారం ఉందని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.
తొందరలోనే ఈ వివాదానికి ముగింపు పలుకుతామని స్పష్టం చేశారు. దావూద్కు సంబంధించి పాకిస్ధాన్ వద్ద అన్ని వివరాలున్నాయని ఆయన చెప్పారు. దావూద్ను పట్టుకోవడంలో పాకిస్ధాన్ ప్రభుత్వం విఫలమవుతోందని ఈ మేరకు రాజ్నాథ్ సోమవారం లోక్సభలో ఓ ప్రకటన చేశారు.
అయితే ఎలాగైనా సరే దావూద్ ఇబ్రహీంని భారత్కు రప్పించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. గత వారంలో లోక్సభలో 'దావూద్ ఎక్కడున్నాడో ప్రభుత్వానికి ఇంతవరకూ తెలియదు. అతని ఆచూకీ తెలుసుకున్న తర్వాత అప్పగింత ప్రక్రియ మొదలవుతుంది' అన్న హోం శాఖ సహాయ మంత్రి హరిభాయ్ పార్తీభాయ్ చౌధురి ప్రకటనతో లోక్సభలో దుమారం చెలరేగింది.
దీంతో ఈ రోజు రాజ్నాథ్ లోక్సభలో ఈ సోమవారం నిత్యానంద్ రాయ్ అనే సభ్యుడికి ఈమేరకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. దావూద్ పాక్లో ఆ దేశ భద్రతా బలగాల అండతో తలదాచుకుంటున్నాడని భారత ప్రభుత్వం పలు వివరాలను పాక్కు అందించడం, అతన్ని తమకు అప్పగించాలని హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ గతంలో డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దావూద్ ఇబ్రహీంపై రెడ్ కార్నర్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో నోటీసులు కూడా ఉన్నాయి.