‘ములాయం పుట్టిన రోజుకు దావూద్, తాలిబన్ నిధులు’
రాంపూర్: సమాజ్వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ 75వ జన్మదిన వేడుకలు జరిపేందుకు ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని విపక్షాల నుంచి వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి అజాంఖాన్ వివాదాస్పదంగా స్పందించారు.
తమ పార్టీ అధినేత జన్మదిన వేడుకలకు అయ్యే ఖర్చును అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, అబూసలెం, తాలిబన్ చెల్లిస్తాయని అన్నారు. ములాయం సింగ్ యాదవ్ జన్మదిన వేడుకల కోసం వెచ్చించే నిధుల గురించి మీడియా అడిగిన ప్రశ్నకు అజాంఖాన్ పై విధంగా సమాధానం చెప్పారు.
‘దావూద్, తాలిబన్, అబూసలెంలు ములాయం జన్మదిన వేడుకల కోసం అయ్యే ఖర్చును చెల్లిస్తారు' అని అజాంఖాన్ తెలిపారు. అజాంఖాన్ ప్రాతినిథ్యం వహిస్తున్న రాంపూర్లో ములాయం జన్మదిన వేడుకల కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవంబర్ 22న ములాయం పుట్టిన రోజు.
ములాయం పుట్టిన రోజుకు 75 అడుగుల కేకు
శనివారం జరగనున్న ములాయం సింగ్ జన్మదిన వేడుకలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. శనివారం ఆయన 75వ యేట అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా పుట్టిన రోజు వేడుకలకు రాంపూర్లో పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. శుక్రవారం నుంచే వేడుకలు ప్రారంభమయ్యాయి. పుట్టిన రోజు కోసం విక్టోరియన్ బగ్గీని విదేశాల నుంచి తెప్పించారు.
75వ పుట్టిన రోజు సందర్భంగా 75 అడుగుల కేకును తయారు చేయిస్తున్నారు. శనివారం జరగనున్న పుట్టిన రోజు వేడుకలకు ములాయంతోపాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్ కూడా హాజరుకానున్నారు. వేడుకల కోసం రాంపూర్ నగరమంతా బెలూన్లు, స్వాగత తోరణాలతో ముస్తాబు చేశారు.