మీరు తప్పుకోండి: మంత్రికి షాక్, దాడి.. దినకరన్ వర్గీయుల పరుగు
తిరుచ్చి రాక్ఫోర్ట్ అందాలను వీక్షించేందుకు వెళ్లిన తమిళనాడు మంత్రి వెల్లమండి నటరాజన్కు చేదు అనుభవం ఎదురైంది. టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన కొందరు మంత్రి కారును అడ్డుకుని ఆయనతో వాగ్వాదానికి దిగారు.
చెన్నై: తిరుచ్చి రాక్ఫోర్ట్ అందాలను వీక్షించేందుకు వెళ్లిన తమిళనాడు మంత్రి వెల్లమండి నటరాజన్కు చేదు అనుభవం ఎదురైంది. టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన కొందరు మంత్రి కారును అడ్డుకుని ఆయనతో వాగ్వాదానికి దిగారు.
రివర్స్ వ్యూహం: సీఎంగా పన్నీరుసెల్వం, శశికళకు పళనిస్వామితోతో చెక్!
దినకరన్ను పార్టీ నుంచి వైదొలగమని చెప్పడానికి మీరు ఎవరని ప్రశ్నించారు. ఇది మంత్రి, దినకరన్ వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. రాక్ఫోర్ట్ నుంచి తిరుచ్చి అందాలను వీక్షించేందుకు ఏర్పాటు చేసిన టెలిస్కోన్ను ప్రారంభించేందుకు నటరాజన్తోపాటు మరో మంత్రి వళర్మతి తదితరులతో కలిసి తిరుచ్చి చేరుకున్నారు.
దినకరన్ వర్గం నేతలు..
ప్రారంభోత్సవం అనంతరం తిరిగి బయలుదేరిన వారిని దినకరన్ వర్గానికి చెందిన రాజరాజ చోళన్ ఆధ్వర్యంలో కొందరు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
దినకరన్ను తప్పించేందుకు మీరెవరని..
పార్టీ పదవి నుంచి దినకరన్ను తప్పించడానికి మీరు ఎవరని ఆయన వర్గం ప్రశ్నించింది. అందుకు మంత్రి మాట్లాడుతూ.. ఆ అధికారం తమకు ఉందని చెప్పారు. దీంతో ఇరు వర్గాలు పరస్పరం నినాదాలు చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అంతేకాదు, ఒకరిపై ఒకరు దాడులకు దిగారు.
మిమ్మల్ని తొలగించే హక్కు మాకు.. మంత్రికి ఝలక్
పార్టీ పదవి నుంచి వైదొలగమని మిమ్మల్ని డిమాండ్ చేసే అధికారం కార్యకర్తలుగా మాకు ఉందని దినకరన్ వర్గీయులు.. మంత్రిని పార్టీ పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రాలను అందించారు. తర్వాత దినకరన్కు మద్దతుగా, మంత్రి వెల్లమండి నటరాజన్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అక్కడ కలకలం చోటు చేసుకుంది.
ముష్టిఘాతాలు.. దినకరన్ వర్గీయుల పరుగు
దీనికి మంత్రి అనుచరులు తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. పరస్పరం ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. మంత్రి అనుచరగణం ఎక్కువగా ఉండటంతో రాజరాజచోళన్, ఆయన వర్గీయులు అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు.
అరెస్టులు
దీనిపై రాజరాజచోళన్ సహా అయిదుగురిపై మలైకోట్టై పోలీసులకు అన్నాడీఎంకే (అమ్మ) యూనిట్ కార్యదర్శి అన్బళగన్ ఫిర్యాదు చేశారు. మంత్రులు నటరాజన్, వళర్మతి, ఎమ్పీ కుమార్ తదితరులను దుర్భాషలాడటంతో పాటు రాళ్లతో దాడి చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై శనివారం ఉదయం కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
రెండో రోజు దినకరన్ను ప్రశ్నిస్తున్న పోలీసులు
రెండాకుల గుర్తు కోసం ఎన్నికల సంఘం అధికారికి లంచం ఇవ్వజూపారన్న ఆరోపణలపై అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ నాయకుడు దినకరన్ను ఢిల్లీ క్రైం బ్రాంచ్ రెండోరోజు ప్రశ్నిస్తున్నారు. శనివారం క్రైం బ్రాంచికి చెందిన ఏసీపీ స్థాయి అధికారి ఒకరు స్థానిక చాణక్యపురిలోని ఇంటర్స్టేట్ సెల్ కార్యాలయంలో దినకరన్ను విచారించారు. విచారణ ఇంకా పూర్తి కానుందున రెండో రోజూ ఆయన్ని ప్రశ్నిస్తున్నారు.