ఢిల్లీ అల్లర్లు-బీజేపీ సీనియర్ నేతకు లింకేంటీ? ఆ హెచ్చరికల తరువాతే: ఢిల్లీ డీసీపీకి తీవ్రగాయాలు..!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా ఆందోళనకారులు చేపట్టిన వ్యతిరేక ప్రదర్శనలు హింసాత్మక రూపాన్ని దాల్చుకున్నాయి. ఈశాన్య ఢిల్లీని అట్టుడికిస్తున్నాయి. ఓ హెడ్ కానిస్టేబుల్ సహా అయిదుమంది ప్రాణాలను కోల్పోవడానికి కారణం అయ్యాయి. ఈ అల్లర్లు, హింసాత్మక పరిస్థితుల వెనుక భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడి పేరు వినిపిస్తోంది.
ఢిల్లీ అల్లర్లు, మూకదాడులపై ఒవైసీ సంచలన ట్వీట్..పొయెట్: అయిదుకు చేరిన మృతుల సంఖ్య
కపిల్ మిశ్రా హెచ్చరికల ప్రభావం ఉందా?
ఆయన చేసిన హెచ్చరికల తరువాతే.. ఈ ఘటనలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వ్యక్తమౌతున్నాయి. ఆయనే- కపిల్ మిశ్రా. భారతీయ జనతా పార్టీ ఢిల్లీ శాఖకు చెందిన సీనియర్ నాయకుడు. స్థానికంగా ఆయనకు ఫైర్బ్రాండ్ ఇమేజ్ ఉంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలను చేపట్టిన ఆందోళనకారులను హెచ్చరిస్తూ ఆయన కొన్ని షాకింగ్ కామెంట్స్ జారీ చేశారు.. బహిరంగంగా. ఆయన ఈ హెచ్చరించిన 24 గంటలు కూడా గడవక ముందే పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. దాడులు, ప్రతిదాడులు, మూకదాడులు చోటు చేసుకున్నాయి.
ఆయనేం చెప్పారు?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్ భారత్ పర్యటన ముగించుకుని తిరిగి వెళ్లే లోపు జఫ్రాబాద్, మౌజ్పూర్ సహా అన్ని ప్రాంతాలనూ ఖాళీ చేయాల్సి ఉంటుందని ఆయన నిరసనకారులను ఉద్దేశించి హెచ్చరించారు. ఢిల్లీలో శాంతియుత వాతావరణం, సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోవాల్సిందేనంటూ పోలీసులకూ అల్టిమేటం ఇచ్చారాయన. అలా వారు రోడ్లను ఖాళీ చేయకపోతే.. పోలీసులు చేయాల్సిన పనిని తామే చేస్తామనీ హెచ్చరించారు.
వైరల్గా మారిన వీడియో క్లిప్
దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కపిల్ మిశ్రా ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల వ్యవధిలో జఫ్రాబాద్, మౌజ్పూర్ల్లో ఘర్షణలు చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన హెచ్చిరకలను నిజం చేసేలా బీజేపీ కార్యకర్తలు తమపై దాడులకు పాల్పడుతున్నారని పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ఈ చట్టానికి మద్దతు ఇస్తోన్న బీజేపీ, సంఘ్ పరివార్ కార్యకర్తలతో కలిసి తమపై దాడులకు పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు.
Recommended Video
డీసీపీ తలకు తీవ్ర గాయాలు..
ఈ దాడులను నియంత్రించడానికి వెళ్లిన ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ (షాహదారా) అమిత్ శర్మ కూడా తీవ్రంగా గాయపడ్డారు. రాళ్ల దాడిలో ఆయన తలకు తీవ్ర గాయమైంది. రక్తమోడుతున్న ఆయనను జీటీబీ ఆసుపత్రికి తరలించారు. మరింత మెరుగైన చికిత్స కోసం మ్యాక్స్ పత్పర్ గంజ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆయనకు శస్త్ర చికిత్సను నిర్వహించారు. ప్రస్తుతం అమిత్ శర్మ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని డాక్టర్లు వెల్లడించారు.