మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి పరార్ ? పోలీసుల వేట, 57 కేజీల బంగారం, ఈడీకి లంచం!
Recommended Video
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి దీపావళి పండుగ రోజు సినిమా కష్టాలు మొదలైనాయి. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, ఆయన అనుచరులు పరారైనారని, వారి కోసం బెంగళూరు సీసీబీ పోలీసులు పలు ప్రాంతాల్లో గాలిస్తున్నారని బుధవారం వెలుగు చూసింది. ఈడీ అధికారికి గాలి జనార్దన్ రెడ్డి రూ. ఒక కోటి లంచం ఎరవేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే సీసీబీ పోలీసులు సీఎం కుమారస్వామికి సమాచారం ఇవ్వడంతో ముందస్తు బెయిల్ కోసం గాలి జనార్దన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది.
గాలి జనార్దన్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యేలు ఫైర్: ఇంత చులకనా, సారీ చెప్పిన రెడ్డి
బెంగళూరు సీసీబీ జాయింట్ పోలీసు కమీషనర్ అలోక్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఢిల్లీ, హైదరాబాద్, చిత్రదుర్గ, మాళకాల్మూరు తదితర ప్రాంతాల్లో గాలి జనార్దన్ రెడ్డి ఆయన అనుచరుల కోసం గాలిస్తున్నారని సమాచారం.
అంబిడెంట్ కంపెనీ
బెంగళూరు నగరంలోని డీజేహళ్ళి, బాణసవాడి, ఆర్ టీ నగర్ తదితర ప్రాంతాల్లో 2017లో అంబిడెంట్ అనే కంపెనీని ఫరీద్ అనే వ్యక్తి ప్రారంభించాడు. అంబిడెంట్ కంపెనీలో అనేక మంది నగదు డిపాజిట్ చేశారని సమాచారం.
57 కేజీల బంగారం డీల్
అంబిడెంట్ కంపెనీ నుంచి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఎన్నోబుల్ ఇండియా కంపెనీ పేరుతో ఆయన ముఖ్య అనుచరుడు ఆలీఖాన్ 57 కేజీల బంగారం తీసుకున్నాడని తెలిసింది. ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు జూన్ నెలలో అంబిడెంట్ కంపెనీ మీద దాడులు చేసిన సమయంలో 57 కేజీల బంగారం వ్యవహారం బయటకు వచ్చింది.
పోలీసు కేసులు
తాము డిపాజిట్ చేసిన నగదు ఇవ్వకుండా ఫరీద్ మోసం చేశాడని అనేక మంది భాదితులు సెప్టెంబర్ నెలలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా అంబిడెంట్ కంపెనీ ముందు భాదితులు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఫరీద్ మీద కేసులు నమోదు అయ్యాయి.
రూ. 21 కోట్లు డీల్ చేసిన రెడ్డి ?
అంబిడెంట్ కంపెనీని కేసు నుంచి రక్షించడానికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు చెందిన అధికారితో తాజ్ వెస్టెండ్ హోటల్ లో గాలి జనార్దన్ రెడ్డి రూ. 21 కోట్లకు డీల్ మాట్లాడారని ఆరోపణలు ఉన్నాయి. అంతే కాకుండా ఈడీకి చెందిన బిజ్రేష్ అనే అధికారికి రూ. ఒక కోటి లంచం ఇచ్చారని ప్రముఖ టీవీ న్యూస్ చానల్ కథనం ప్రసారం చేసిందని ఓ ఆంగ్ల దిన పత్రిక వార్త ప్రచురించింది.
రెడ్డి అండ్ కోసం వేట
గాలి జనార్దన్ రెడ్డి, ఆయన ముఖ్య అనుచరుడు ఆలీఖాన్, ఫరీద్ తదితరుల కోసం బెంగళూరు పోలీసులు గాలిస్తున్నారని సమాచారం. గాలి జనార్దన్ రెడ్డి, ఆలీఖాన్, ఫరీద్ కోసం బెంగళూరు సీసీబీ విభాగం ప్రత్యేక బృందాల పోలీసులు గాలిస్తున్నారు.
ఫోన్లు స్విచ్ ఆఫ్
పెద్ద నోట్లు రద్దు అయిన సమయంలో భారీ మొత్తంలో గాలి జనార్దన్ రెడ్డి నగదు మార్పిడి చేశారని ఆరోపణలు ఉన్నాయి. గాలి జనార్దన్ రెడ్డి ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీలోని ఫాంహౌస్ ల్లో తలదాచుకుని ఉంటారని బెంగళూరు సీసీబీ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఒక్కరోజు తేడాతో సినిమా
బళ్లారి లోక్ సభ ఉప ఎన్నికల కౌంటింగ్ మంగళవారం పూర్తి అయ్యింది. బళ్లారిలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన వెంటనే పాత కేసు విషయంలో గాలి జనార్దన్ రెడ్డి కోసం వేట మొదలైయ్యింది. మొత్తం మీద గాలి జనార్దన్ రెడ్డి ఆచూకి చిక్కిన తరువాత ఈ కేసు వ్యవహారం పూర్తి వివరాలు వెలుగు చూసే అవకాశం ఉందని సమాచారం.