సైనికుల్ని అవమానిస్తారా: కేజ్రీ-రాహుల్లపై అమిత్ షా ఫైర్
న్యూఢిల్లీ: సర్జికల్ స్ట్రయిక్ దాడుల అంశంపై కాంగ్రెస్ తీరును బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా శుక్రవారం నాడు ఖండించారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
సర్జికల్ స్ట్రయిక్ దాడులపై కొన్ని పార్టీలు అనవసర సందేహాలు వ్యక్తం చేస్తున్నాయన్నారు. రాజకీయం చేయెద్దని తొలి నుంచీ చెబుతున్నామన్నారు. సైన్యం సామర్థ్యాన్ని తక్కువ చేసేలా కొన్ని పార్టీలు మాట్లాడుతున్నాయన్నారు.
సర్జికల్ స్ట్రయిక్ దాడులపై రాజకీయ పార్టీల వైఖరిని ఆయన ఖండించారు. రాజకీయాలకు దూరంగా ప్రభుత్వం కార్యాచరణ చేపడుతోందని స్పష్టం చేశారు. సర్జికల్ స్ట్రయిక్స్ తర్వాత సైనికుల మనోబలం మరింత పెరిగిందని చెప్పారు.
అయితే సైనికుల వీరోచిత దాడిని విపక్షాలు కించపరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సర్జికల్ స్ట్రయిక్ వీడియోలు బయటపెట్టమని చెప్పడం బాధాకరమన్నారు. విపక్షాలు సైనికులను అవమానించడం బాధాకరమన్నారు.
మెరుపు దాడిని రాజకీయం చేయడం సరికాదన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్, ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సైనికులను కించపరుస్తున్నారన్నారు. సర్జికల్ స్ట్రయిక్ పైన దేశం మొత్తం హర్షిస్తోందన్నారు.