ఎట్టకేలకు గుజరాత్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ
అహ్మదాబాద్: గుజరాత్ తొలి విడత ఎన్నికల పోలింగ్ మరి కొద్ది గంటలే ఉందనగా 'సంకల్ప్ పాత్ర 2017' (విజన్ డాక్యుమెంట్) పేరుతో గుజరాత్ ఎన్నికల మేనిఫెస్టేను బీజేపీ బుధవారంనాడు విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఫోటోలు కవర్ పేజీపై ముద్రించిన పార్టీ మేనిఫెస్టోను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అహ్మదాబాద్లో విడుదల చేశారు.
డిసెంబర్ 4న కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రెండో విడత ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. 'బీజేపీ మేనిఫెస్టో ఏది?' అంటూ ప్రశ్నించారు. కాగా, శనివారం తొలిదశ ఎన్నికల పోలింగ్ ఉండగా, శుక్రవారమే బీజేపీ ఈ మేనిఫెస్టోను విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది.
బీజేపీ 'సంకల్ప్ పాత్ర' విడుదల అనంతరం అరుణ్ జైట్లీ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో తప్పులు హామీలు గుప్పించిందన్నారు. కాంగ్రెస్ హామీలన్నీ రాజ్యాంగపరంగా కానీ, అర్థికపరంగా అమలుకు సాధ్యం కావని అన్నారు. బీజేపీ రెండు దశాబ్దాల పాలనలో గుజరాత్ ఎంతో అభివృద్ధి సాధించిందని, గత ఐదేళ్లలో అతి పెద్ద రాష్ట్రాల్లో గుజరాత్ సగటున 10 శాతం వృద్ధి సాధించిందన్నారు.
గుజరాత్ ఐక్యతకు, రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి బీజేపీ కట్టుబడి ఉందని జైట్లీ స్పష్టం చేశారు. సామాజిక ఏకీకరణ కాంగ్రెస్కు నష్టం మిగల్చబోతోందన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, రైతు ఉత్పత్తులకు మంచి ధర కల్పిస్తామని కూడా బీజేపీ మేనిఫెస్టో హామీ ఇచ్చింది. సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించడంతో పాటు గుజరాత్ యువకుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు వివరించింది. కాగా, తొలి దశ ఎన్నికల గంటల ముందే మేనిఫెస్టోను విడుదల చేయడంపై రాహుల్ విమర్శలు గుప్పించారు.