ఆ లాయర్ చెప్పిందే నిజమైంది... గ్యాంగ్స్టర్ దూబే ఎన్కౌంటర్.. నిన్ననే సుప్రీంలో పిల్..
శుక్రవారం తెల్లవారుజామున కాన్పూర్ గ్యాంగ్స్టర్ వికాస్ దూబేని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ-కాన్పూర్ మార్గంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో దూబే అరెస్ట్ అనంతరం అతన్ని కాన్పూర్ తరలిస్తుండగా ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. మార్గమధ్యలో దూబేని తరలిస్తున్న కారు బోల్తా పడటంతో... అతను తప్పించుకునేందుకు ప్రయత్నించాడని పోలీసులు చెబుతున్నారు.
ఈ క్రమంలో అతను ఓ పోలీస్ అధికారి నుంచి గన్ లాక్కుని పారిపోయేందుకు యత్నించగా కాల్పులు జరిపినట్లు స్పష్టం చేశారు. అయితే ఈ ఎన్కౌంటర్ను ఓ న్యాయవాది ముందుగానే ఊహించారు. దీనిపై గురువారమే(జూలై 9) ఆయన సుప్రీం కోర్టులో పిల్ కూడా దాఖలు చేశారు.
ఫేక్ ఎన్కౌంటర్ చేస్తారని పిల్...
ముంబైకి చెందిన న్యాయవాది గణ్ శ్యామ్ ఉపాధ్యాయ్ దూబే అరెస్టుపై గురువారం సాయంత్రం సుప్రీంలో ఒక పిల్ దాఖలు చేశారు. దూబేని 'ఫేక్ ఎన్కౌంటర్' చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అందులో పేర్కొన్నారు. ఇప్పటికే అతను అనుచరులు నలుగురిని ఎన్కౌంటర్ చేసిన నేపథ్యంలో... ఇతన్ని కూడా ఎన్కౌంటర్ చేసే అవకాశం ఉందన్నారు. దూబే ఎన్కౌంటర్కి కూడా ఏదో ఒక కట్టు కథ అల్లుతారని పేర్కొన్నారు.
తనకేమీ సానుభూతి లేదన్న లాయర్...
న్యాయవాది గణశ్యామ్ మాట్లడుతూ... తనకు దూబేపై ఎలాంటి సానుభూతి లేదన్నారు. అయితే అఫ్జల్ గురు,అజ్మల్ కసబ్ లాంటి వాళ్లకు సైతం న్యాయపరమైన విచారణకు అవకాశం ఇచ్చినప్పుడు... దూబేపై కూడా న్యాయపరమైన విచారణ జరగాలన్నారు. అదేమీ లేకుండా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఉత్తరప్రదేశ్ పోలీసులు అతన్ని కాల్చి చంపితే ఎలా అని ప్రశ్నించారు.
దూబేపై 60 కేసులు...
దూబేపై ఇప్పటివరకూ 60 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఐదు హత్య కేసులున్నాయి. అలాగే 8 హత్యాయత్నం కేసులున్నాయి. అయినప్పటికీ అతను ఎప్పటికప్పుడు బెయిల్ పొందుతూ బయటే తిరుగుతున్నాడు. పోలీసులు అవినీతికి లొంగిపోయి తమ విధులను సరిగా నిర్వర్తించకపోవడం వల్లే దూబే నేర కార్యకలాపాలు ఇలా యథేచ్చగా సాగాయని న్యాయవాది గణశ్యామ్ పేర్కొనడం గమనార్హం.
Recommended Video
సీబీఐ దర్యాప్తుకు డిమాండ్..?
దూబే అనుచరుల ఎన్కౌంటర్పై సీబీఐ విచారణ జరిపించాలని న్యాయవాది గణశ్యామ్ సుప్రీంను కోరారు. అలాగే పోలీసులు,రాజకీయ నాయకులతో దూబే లింకులపై సమగ్ర విచారణ జరపాలన్నారు. అంతేకాదు,చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఉత్తరప్రదేశ్ పోలీసులు జరుపుతున్న ఎన్కౌంటర్స్కు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయవాది గణశ్యామ్ ఊహించినట్లుగానే దూబే ఎన్కౌంటర్ జరగడంతో... దీనిపై కూడా ఆయన సీబీఐ విచారణ కోరే అవకాశం ఉంది.