పట్టపగలు నడివీధిలో మహిళను బెదిరించి దోపిడీ: వీడియో హల్చల్
చెన్నై: రెండు రోజుల క్రితం ఓ మహిళను పట్టపగలు బెదిరించి ఆమె బంగారు నగలు దోపిడీ చేసిన సంఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీ బయటకు వచ్చింది. మహిళను ఆమె ఇంటికి సమీపంలోనే బెదిరించి నగలు దోచుకెళ్లాడు ఓ దుండగుడు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
వీడియో ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించవలసి ఉంది. అలాగే బాధితురాలు ఆ షాక్ నుండి ఇంకా తేరుకోలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తోంది.
వీడియోలో దోపిడీకి పాల్పడిన వ్యక్తి కత్తితో మహిళను బెదిరిస్తున్నట్లుగా ఉంది. బాధితురాలి పేరు వేలమ్ సెంథిల్ (39). ఆమె పాఠశాల ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఈ దోపీడీ మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో జరిగింది.
సెంథిల్ ఎంసీఎన్ నగర్, సెకండ్ లేన్కు చెందిన మహిళ. ఆమె తన టూవీలర్ పైన ఇంటికి వెళ్తుండగా దోపీడీదారు మరో టూవీలర్ పైన వచ్చాడు. అతడితో పాటు మరొకతను ఉన్నాడు. ఆ సమయంలో మహిళ రోడ్డు పైన పడిపోయింది.
అంతలోనే వారు అక్కడకు వచ్చి ఆమెను కత్తితో బెదిరించి నగలు దోచుకెళ్లారు. నగలు ఇవ్వకుండే చంపేస్తామని ఆమెను బెదిరించారు. దీంతో వాటిని వారి చేతుల్లో పెట్టింది.
కాగా, ఈ సంఘటనను అదే పరిసర ప్రాంతాల్లోని ఇంట్లో ఉన్న ఓ వ్యక్తి తన ఫోన్ ద్వారా చిత్రీకరించాడు. మహిళ తన ఒంటి పైన ఉన్న నగలను తీసి ఇస్తున్న దృశ్యం కూడా వీడియోలో ఉంది. నగలు తీసివ్వగానే వారు అక్కడి నుండి బైక్ పైన పారిపోయారు. ఆ భయంలో ఆమె పోలీసులకు ఫోన్ చేసే ప్రయత్నం చేయలేదు. ఫోన్లో వీడియో తీసిన వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు.