సీఎం యోగి హెచ్చరించిందే జరిగింది.. ఆ 28 మందికి నోటీసులు..
జాతీయ పౌరసత్వ పట్టిక(NRC),పౌరసత్వ సవరణ చట్టం(CAA)లను వ్యతిరేకిస్తూ ఉత్తరప్రదేశ్లో జరిగిన నిరసన ర్యాలీలు హింసాత్మక రూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనల్లో 16 మంది పౌరులు చనిపోగా.. ప్రజా ఆస్తులకు నష్టం వాటిల్లింది. దీంతో నష్ట నివారణ చర్యలకు దిగిన ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలతో పాటు వారి నుంచే డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తాజాగా రాంపూర్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ 28 మందికి నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినందుకు రూ.14,86,500 చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది. నిరసన ర్యాలీల్లో విధ్వంసానికి పాల్పడినవారు మూల్యం చెల్లించుకోక తప్పదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించిన కొద్ది రోజులకే ఈ నోటీసులు జారీ అవడం గమనార్హం.
నోటీసులు జారీ అయినవాళ్లలో ఒక ఎంబ్రాయిడరీ వర్కర్తో పాటు సుగంధ ద్రవ్యాల వ్యాపారి కూడా ఉన్నాడు. నోటీసుల్లో ప్రభుత్వ ఆస్తులకు జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలను కూడా ప్రస్తావించారు. భోట్ పోలీస్ స్టేషన్కు చెందిన రూ.7,50,000 విలువైన జీపును ధ్వంసం చేసినట్టు పేర్కొన్నారు. అలాగే రూ.65వేలు విలువ చేసే ఓ ఎస్ఐ మోటార్ సైకిల్, కొత్వాలి పోలీస్ స్టేషన్కు చెందిన రూ.90వేలు విలువైన మోటార్ సైకిల్ను ధ్వంసం చేసినట్టు తెలిపారు. అలాగే వైర్ లెస్ సెట్,లౌడ్ స్పీకర్స్,10 కర్రలు,3 హెల్మెట్స్ ఇతరత్రా వస్తువులను నిరసనకారులు ధ్వంసం చేసినట్టు పేర్కొన్నారు. ఇంత భారీ నష్టాన్ని ప్రభుత్వం ఎందుకు రికవరీ చేయకూడదో చెప్పాలని నోటీసుల్లో వివరణ కోరారు.
ఆ 28 మంది ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించారని పోలీస్ విచారణలో నిర్దారణ అయిన తర్వాతే నోటీసులు పంపించినట్టు రాంపూర్ జిల్లా మెజిస్ట్రేట్ ఆంజనేయ కుమార్ సింగ్ తెలిపారు. పోలీసుల వద్ద మీడియా నుంచి,స్థానికుల నుంచి సేకరించిన ఫోటోలు,వీడియోల ఆధారాలు ఉన్నాయని చెప్పారు. మొత్తం 150 మందికి అల్లర్లతో ప్రమేయం ఉన్నట్టుగా తేల్చామని,అందులో ఇప్పటివరకు 33 మందిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.