ప్రజల ఆందోళనతో క్యాబ్పై మారిన ఏజీపీ స్వరం, సుప్రీంకోర్టులో పిటిషన్, మోడీ, అమిత్తోనూ భేటీ
పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య భారతదేశం అట్టుడుకుతోంది. బిల్లును వెనక్కి తీసుకోవాలని ప్రజల ఆందోళన మిన్నంటింది. క్యాబ్ బిల్లుకు పార్లమెంట్లో మద్దతిచ్చిన అసోం గణ పరిషత్ (ఏజీపీ) ప్రజల నిరసనలతో వెనక్కి తగ్గింది. బిల్లుపై తమ మాటను మార్చింది. బిల్లుకు సవరణలు చేయాలని, లేదంటే వెనక్కి తీసుకోవాలని ప్రజలతో గొంతు కలిపింది.
నిరసనల హోరు
క్యాబ్ బిల్లును నిరసిస్తూ అసోంలో నిరసనలు పెల్లుబికాయి. రహదారులపైకి వచ్చిన ప్రజలు టైర్లను కాల్చివేస్తున్నారు. బస్సు అద్దాలు ధ్వంసం చేస్తున్నారు. ఇళ్లలోకి చొరబడి మరీ బీభత్సం సృష్టిస్తున్నారు. దీంతో ఏజీపీ స్టాండ్ మార్చుకుంది. పౌరసత్వ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, టీఎంసీ ఎంపీ మహువా సహా పదుల సంఖ్యలో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీరికి ఏజీపి జత కలిసినట్లైంది.
వెనక్కి తగ్గింది
అసోంలో ఆందోళనలపై ఏజీపీ తమ పార్టీలో చర్చించింది. ప్రజలతో ముడిపడి ఉన్న సున్నిత అంశంపై.. వ్యతిరేకంగా వెళ్లడం మంచిది కాదని నిర్ణయానికొచ్చింది. దీంతోపాటు తమ సమస్యపై ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షాను కూడా కలువాలని నిర్ణయం తీసుకుంది. తమ ఇబ్బందులను చెప్పి.. సవరణలు చేయాలని కోరే అవకాశం ఉంది.
పార్టీ కార్యాలయంలోకి..
మరోవైపు గురువారం గువాహటిలోని అంబారీ ప్రాంతంలో ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయంలోకి ఆందోళనకారులు చొచ్చుకొచ్చారు. క్యాబ్ బిల్లును నిరసిస్తూ నినాదాలు చేశారు. తర్వాత భవనంలో చొరబడ్డారు. ఇటు గోపినాథ్ బోర్డోలాయ్ దారిలో ఉన్న భవనంపై కూడా ఆందోళనకారులు దాడి చేశారు. కిటీకి అద్దాలు ధ్వంసం చేశారు. అక్కడున్న వాహనాలను ధ్వంసం చేశారు. అందులో పోలీసుల వాహనాలు కూడా ఉన్నాయి. ఆందోళనకారులను నిలువరించే క్రమంలో లాఠీచార్జీ చేశామని, తప్పని పరిస్థితుల్లో టీయర్ గ్యాస్ ప్రయోగించామని చెప్తున్నారు.
పిటిషన్లు
టీఎంసీ ఎంపీ మహూవా సహా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అన్నీ పిటిషన్లను కలిపి ఈ నెల 18న సర్వోన్నత న్యాయస్థానం విచారించే అవకాశం ఉన్నది. వీటితో ఏజీపీ వేసే పిటిషన్ కూడా కలిపి హియరింగ్కు వచ్చే ఛాన్స్ ఉంది. ఒకే అంశానికి సంబంధించినందున.. ఓకేసారి విచారిస్తామని సర్వోన్నత ధర్మాసనం తెలియజేయనుంది.