పరువు హత్య: పెళ్ళైన కొద్ది గంటల్లోనే భర్త హత్య, భార్యసోదరుడే సూత్రధారి?
తిరువనంతపురం: ప్రేమించి పెళ్ళి చేసుకొన్నందుకు ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పెళ్ళి చేసుకొన్న కొద్ది గంటల్లో వరుడు హత్యకు గురికావడం సంచలనం సృష్టించింది.ఈ ఘటన కేరళలోని కొట్టాయం జిల్లాలో చోటు చేసుకొంది.
కేరళలోని కొట్టాయంకు చెందిన కెవిన్ పి జోసెఫ్ ఎలక్ట్రిషియన్గా పనిచేస్తున్నాడు. కొల్లాంకి చెందిన నీనూ, కెవిన్ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కెవిన్ దళిత క్రిస్టియన్ . నీనూ తండ్రి క్రిస్టియన్, ఆమె తల్లి ముస్లిం. తల్లిదండ్రులిద్దరిదీ మతాంతర వివాహమే అయినప్పటికీ కెవిన్తో నీనూ పెళ్లి ఆమె సోదరుడికి ఇష్టం లేదు.
ఈ నేపథ్యంలో శుక్రవారం ఇద్దరూ ప్రత్యేక వివాహం చట్టం కింద తమ వివాహాన్ని నమోదు చేయించుకున్నారు. శనివారం అర్ధరాత్రి ఓ గ్యాంగ్ ఆయుధాలతో కెవిన్ ఇంటిపై దాడి చేసింది. ఇంట్లో భీభత్సం సృష్టించిన దుండగులు కెవిన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. నీనూ, కెవిన్ కుటుంబం అతడి జాడ కనిపెట్టేందుకు ఎంత తిరిగినా ప్రయోజనం లేకపోయింది.
సోమవారం ఉదయం కొల్లాంకు కొద్ది దూరంలోని చిలియెక్కర ప్రాంతంలో కెవిన్ శవమై తేలాడు. వధువు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తన సోదరుడితో పాటు మరికొందరికి ఈ హత్యవెనుక ప్రమేయం ఉన్నట్టు నీనూ తన ఫిర్యాదులో పేర్కొంది.
గత కొన్ని రోజులుగా తన భర్తకు ప్రాణహాని ఉందని చెప్పినప్పటికీ పోలీసులు నిర్లక్ష్యం వహించారని నీనూ ఆరోపించింది. కెవిన్ కిడ్నాప్ అయినట్టు ఆదివారం ఉదయం ఫిర్యాదు చేసేందుకు వెళ్లినప్పటికీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆమె ఆరోపించింది. .ఈ ఘటనలో ఇప్పటికే కొట్టాయం జిల్లా ఎస్పీని బదిలీ చేయడంతో పాటు గాంధీనగర్ ఎస్సైపై విచారణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.