ఎన్నికల వేళ చిక్కుల్లో శివసేన: 26 మంది కార్పోరేటర్లు పార్టీకి గుడ్బై...కారణం ఇదే..!
థానే: ఎన్నికలకు కొద్దిరోజుల ముందు శివసేన పార్టీకి ఊహించని షాక్ తగిలింది. బీజేపీతో కలిసి పొత్తుతో వెళుతున్న శివసేన పార్టీలో విబేధాలు బయటపడ్డాయి. తూర్పు కల్యాణ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శివసేన పార్టీకి చెందిన 26 మంది కార్పోరేటర్లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాదు మరో 300 మంది పార్టీ కార్యకర్తలు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి రాజీనామా లేఖలను పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాక్రేకు పంపారు.
శివసేనలో చిచ్చు
కల్యాణ్ ఈస్ట్ నియోజకవర్గం టికెట్ శివసేనకు కాకుండా పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్లడంతో ఈ నియోజకవర్గంకు చెందిన శివసేన కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో వీరంతా తమ రాజీనామాలను పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్కు పంపారు. ఇక రాజీనామా చేసిన వారిలో 16 మంది కల్యాణ్ డోంబీవాలి మున్సిపల్ కార్పొరేషన్కు చెందినవారుండగా మరో 10 మంది ఉల్హాస్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పోరేటర్లుగా ఉన్నారు. అయితే అంతా బాగానే ఉందని రెండు పార్టీలు బయటకు చెబుతున్నప్పటికీ ఇరు పార్టీల్లో నుంచి చాలామంది అసంతృప్తులు ఉన్నారనేది వాస్తవమని పార్టీల్లో కొందరు చెవులకొరుక్కుంటున్నారు.
అధినేతను ఇబ్బందుల్లో పెట్టలేకే...
తమ పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాక్రే అంటే తమకు ఎంతో గౌరవమిన అయితే ఇక్కడి నుంచి పోటీ చేసే బీజేపీ అభ్యర్థికి తాము మద్దతు ఇవ్వలేమని చెప్పారు రాజీనామా చేసిన కార్పోరేటర్లు. ఇలా మద్దతు ఇవ్వకుండా తమ అధినేతను ఇబ్బందుల్లోకి నెట్టడం ఇష్టం లేకే తామంతా రాజీనామా చేసినట్లు కార్పొరేటర్లు చెప్పారు. ఇదిలా ఉంటే తాను స్వతంత్ర్య అభర్థిగా పోటీచేయాలని భావిస్తున్నట్లు చెప్పారు రెబెల్ అభ్యర్థి ధనంజయ్ భదోరే. గత 10ఏళ్లుగా తమ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది లేదని చెప్పారు. బీజేపీ అభ్యర్థిని తాము ఆమోదించబోమని అందుకే తానే స్వయంగా రంగంలోకి దిగి పోటీచేస్తున్నట్లు చెప్పారు ధనంజయ్.
బీజేపీకి సహకరించాలన్న ఉద్ధవ్
మరోవైపు బీజేపీ అభ్యర్థులకు సహకరించి మద్దతు తెలపాలని పలుమార్లు శివసేన చీఫ్ రెబల్ అభ్యర్థులను అభ్యర్థించారు. కానీ వారెవరూ వినేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఇక పొత్తులో భాగంగా టికెట్లు దక్కని వారు బాధపడకూడదని తనను క్షమించాల్సిందిగా కోరారు ఉద్ధవ్ థాక్రే. అదేసమయంలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 150 స్థానాల్లో పోటీ చేయనుండగా శివసేన 126 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇతరులు 14 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. అక్టోబర్ 21న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా కౌంటింగ్ అక్టోబర్ 24న జరగనుంది.