Sputnik V వినియోగానికి డీసీజీఐ గ్రీన్సిగ్నల్: డాక్టర్ రెడ్డీస్: ఆ లిస్ట్లో 60వ దేశంగా
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోన్న వేళ.. నాలుగు రోజుల పాటు టీకా ఉత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సందర్భంలో..దేశంలో కొనసాగుతోన్న వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సడన్ బ్రేక్ పడింది. ఏపీ సహా పలు రాష్ట్రాలు వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటోన్నాయి. ఏపీలో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి తాత్కాలికంగా పుల్స్టాప్ పడిందనే వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, రాజస్థాన్ వంటి చోట్ల చాలినంత వ్యాక్సిన్ అందుబాటులో ఉండట్లేదు. పలు రాష్ట్రాల్లో ఇప్పుడున్న వ్యాక్సిన్ స్టాక్.. మరో నాలుగైదు రోజులకు మించి రాకపోకవచ్చు.
స్పుత్నిక్ వీ వినియోగానికి డీసీజీఐ ఓకే
ఈ పరిస్థితుల మధ్య రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ (Sputnik V) వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అత్యవసర పరిస్థితుల మధ్య ఈ వ్యాక్సిన్ను వినియోగించ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత్లో అత్యవసర పరిస్థితుల్లో తమ వ్యాక్సిన్ను వినియోగించుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ ఇదివరకే స్పుత్నిక్ వీ వ్యాక్సీన్ తయారీ సంస్థ దాఖలు చేసిన దరఖాస్తులపై సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ (ఎస్ఈసీ) ఆమోద ముద్ర తెలిపిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. భారత్లో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇచ్చినట్లు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (RDFI) ప్రకటించింది.
ఆర్డీఎఫ్ఐ స్టేట్మెంట్ ఇదీ
జనాభాపరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశమైన భారత్.. తాము అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ వినియోగించబోతోందని తెలిపింది. తాము నిర్వహించిన మూడోదశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతం కావడంతో డీసీజీఐ ఈ నిర్ణయాన్ని తీసుకుందని పేర్కొంది. కరోనా వైరస్ను నిర్మూలించడానికి స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ను వినియోగిస్తోన్న మూడు కోట్లకు పైగా జనాభా ఉన్న దేశాల జాబితాలో భారత్ 60వ స్థానంలో నిలిచిందని తెలిపింది. ఈ మేరకు స్పుత్నిక్ వీ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ఓ పోస్ట్ పెట్టింది. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ ఈ వ్యాక్సిన్ వినియోగానికి సోమవారం సాయంత్రమే ఆమోదించిన విషయం తెలిసిందే.
డాక్టర్ రెడ్డీస్..
స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ను దేశీయంగా హైదరాబాద్కు చెందిన డాక్టర్ రెడ్డీస్ (Dr Reddy's) తయారు చేస్తోన్న విషయం తెలిసిందే. దీనికోసం రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్తో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రస్తుతం దేశంలో టీకా ఉత్సవ్ నడుస్తోంది. ఆదివారం ప్రారంభమైన ఈ టీకా ఉత్సవ్ బుధవారం వరకూ ఇది కొనసాగాల్సి ఉంది. అదే సమయంలో వ్యాక్సిన్ల కొరత ఏర్పడటం కొంత ఇబ్బందికర పరిస్థితులకు దారి తీసింది. తాజాగా- స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రావడంతో కొరత తీరినట్టవుతుంది. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఇప్పటికే 59 దేశాలకు స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ను పంపించింది.
ఆ రెండు రకాల వ్యాక్సిన్లకు తోడుగా..
ప్రస్తుతం దేశంలో రెండు రకాల వ్యాక్సిన్లను వినియోగిస్తోన్నారు. హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తోన్న ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కోవిషీల్డ్ మాత్రమే వ్యాక్సినేషన్ కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ రెండూ కూడా ప్రస్తుతం దేశీయంగా ఏర్పడిన డిమాండ్ను తీర్చేలా కనిపించట్లేదు. కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఉత్పత్తిని రెట్టింపు చేస్తామని భారత్ బయోటెక్ వెల్లడించింది. సీరమ్ ఇన్స్టిట్యూట్ది కూడా అదే మాట.. అదే బాట. ఇప్పటికిప్పుడు కొరతను అధిగమించేలా వ్యాక్సిన్ను మార్కెట్లోకి తీసుకుని రావడం.. వాటిని సంబంధిత రాష్ట్రాలకు చేర్చడానికి కొంత సమయం పడుతుంది.