కరోనావేళ మరో రిలీఫ్: కొత్త మెడిసిన్కు అనుమతి మంజూరు: 2-డీజీ గురించి తెలుసుకోండి..!
న్యూఢిల్లీ: దేశాన్ని కరోనా గడగడలాడిస్తున్న వేళ భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అత్యవసర వినియోగం కింద మరో డ్రగ్కు అనుమతి మంజూరు చేసింది. 2- డియోక్సీ-డీ- గ్లూకోజ్ (2-డీజీ) అనే మెడిసిన్ తయారీకి డీసీజీఐ అనుమతి మంజూరు చేసింది. 2-డీజీని ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ (ఇన్మాస్), డీఆర్డీఓ, మరియు హైదరాబాదులోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సంయుక్తంగా ఈ మెడిసిన్ను అభివృద్ధి చేయనున్నాయి.
Recommended Video
వేగవంతంగా పనిచేస్తున్న 2-డీజీ మెడిసిన్
కరోనా లక్షణాలతో హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్ కోలుకోవడంలో ఇది వేగవంతంగా పనిచేస్తోందని క్లినికల్ ట్రయల్ ఫలితాల ద్వారా తెలుస్తోంది. అంటే ఈ మెడిసిన్ ఇవ్వగానే ఆక్సిజన్పై ఆధారపడటం తగ్గిపోతుందని తేలింది. జనరిక్ మోలిక్యూల్ మరియు గ్లూకోజ్లా పోలిఉండే ఈ మెడిసిన్ను చాలా సులభంగా తయారు చేయొచ్చని అదే సమయంలో ఎక్కువగా తయారు చేసే వెసులుబాటు ఉందని డీఆర్డీఓ అధికారి ఒకరు తెలిపారు. కరోనా సోకిన పేషెంట్లకు క్లినికల్ ట్రయల్స్లో భాగంగా 2-డీజీ మెడిసిన్ ఇవ్వగా.. తక్కువ సమయంలోనే ఆర్టీపీసీఆర్ టెస్టు చేయగా నెగిటివ్ రిపోర్టు వచ్చిందని తెలిపారు.
వైరస్ను నియంత్రించగలిగే సామర్థ్యం
గతేడాది ఏప్రిల్లో కరోనా తొలి వేవ్ సమయంలో ఇన్మాస్-డీఆర్డీఓ శాస్త్రవేత్తలు ల్యాబ్లో 2-డీజీ మెడిసిన్తో ప్రయోగాలు చేశారు. ఇందుకోసం హైదరాబాదులోని సీసీఎంబీ సహకారం కూడా తీసుకున్నారు. అయితే కోవిడ్ వైరస్కు ఇది బాగా పనిచేస్తుందని గుర్తించారు. అంతేకాదు వైరస్ పెరగకుండా ఈ మెడిసిన్ నియంత్రిస్తోందని కూడా గమనించారు. ఈ ఫలితాల ఆధారంగానే రెండవ దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు డీజీజీ అనుమతులు గతేడాది మే నెలలో మంజూరు చేసింది. ఇక ఫేజ్ -2 క్లినికల్ ట్రయల్స్ మే నెల నుంచి అక్టోబర్ నెల వరకు జరిగాయి. కోవిడ్ -19 పేషెంట్లలో ఈ డ్రగ్ మంచి ఫలితాలను కనబర్చిందని నివేదించారు. రికవరీ కూడా చాలా వేగంగానే జరిగినట్లు నివేదికలో పొందుపర్చారు. రెండవ దశ క్లినికల్ ట్రయల్స్ ముందుగా 6 హాస్పిటల్స్లో నిర్వహించగా... ఆ తర్వాత దేశవ్యాప్తంగా 11 హాస్పిటల్స్లో నిర్వహించారు.
నీటిలో కలిపి 2-డీజీ తీసుకోవాలి
ఇక 2-డీజీ మెడిసిన్ కచ్చితత్వంపై మాట్లాడాల్సి వస్తే... ఈ ఔషధం సమర్థవంతంగా పనిచేసిందని చెప్పారు. కరోనా లక్షణాలున్న వారిపై ఈ మెడిసిన్ను ప్రయోగించగా వారు త్వరగా కోలుకున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ డ్రగ్ పౌడర్ రూపంలో ఒక చిన్న ప్యాకెట్లో వస్తుంది. నీటిలో కలిపి దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది వైరస్ వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్కు గురైన కణాలపై దాడి చేసి వైరస్ను అణిచివేస్తుందని చెప్పారు. ఇది సఫలీకృతం కావడంతో డీసీజీఐ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్కు గతేడాది నవంబర్లో అనుమతి ఇచ్చింది.
ఆక్సిజన్ పై ఆధారపడకుండా...
మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ను 220 మంది పేషెంట్లపై గత డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు ప్రయోగించారు. ఢిల్లీ , ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, తమిళనాడులాంటి రాష్ట్రాల్లో మొత్తం 27 కోవిడ్ హాస్పిటల్స్లో ప్రయోగం చేశారు. అయితే కరోనా లక్షణాలున్న పేషెంట్లు ఈ మెడిసిన్ తీసుకోగానే త్వరగా కోలుకున్నారని అదే సమయంలో ఆక్సిజన్ పై కూడా ఆధారపడలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. కేవలం 3 రోజుల్లో కోలుకున్నట్లు వారు నివేదించారు. అంటే వారికి ఆక్సిజన్ అక్కర్లేకుండానే వారు కోలుకున్నారని పేర్కొంది.