కరోనా రోగులకు గుడ్ న్యూస్- మరో ఎమర్జెన్సీ ఇంజెక్షన్ కు డ్రగ్ కంట్రోలర్ అనుమతి...
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం నానాటికీ తీవ్రమవుతున్న తరుణంలో అందుబాటులో ఉన్న అన్ని ఔషధాలు, అత్యవసర మందులపై కేంద్రం దృష్టిసారిస్తోంది. వివిధ పరిశోధన సంస్ధలు, శాస్త్రవేత్తలు నిరంతరాతంగా కరోనా మందులను పరీక్షిస్తూ జనానిని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదే క్రమంలో నేరుగా కరోనా చికిత్సకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోయినా ఇప్పటికే ఇతర రోగాలకు అత్యవసర పరిస్ధితుల్లో వాడే డ్రగ్స్ ను కరోనాకు కూడా వాడేలా కేంద్రం అనుమతులిస్తోంది. తాజాగా ఇదే కోవలో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా మరో ప్రత్యామ్నాయం సూచించింది.
Recommended Video
కరోనా విలయం: అక్కడ మళ్లీ లాక్ డౌన్.. 235కొత్త కేసులతో పాట్నా బెంబేలు..
కరోనా రోగులకు గుడ్ న్యూస్..
ఓ మోస్తరు లేదా తీవ్ర కరోనా లక్షణాలతో బాధపడుతున్న రోగులకు వాడేందుకు మరో ప్రత్యామ్నాయ ఔషధానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసింది. ఇప్పటివరకూ సొరియాసిస్ రోగులకు అత్యవసర పరిస్ధితుల్లో వాడుతున్న ఇటోలీజుమాబ్ అనే యాంటీబాడీ ఇంజెక్షన్ ను కరోనాకు వాడేందుకు అనుమతిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పరిమిత అత్యవసర వాడకం గానే దీన్ని పరిగణించాలని ఆదేశాలిచ్చింది. ప్రత్యేకంగా నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో ఏయో రోగులకు వీటిని ఇవ్వాలో పలు సూచనలు కూడా చేసింది.
బయోకాన్ ఉత్పత్తి....
ప్రస్తుతం భారత్ లో సొరియాసిస్ చికిత్సలో భాగంగా అత్యవసర పరిస్ధితుల్లో ఇటోలీజుమాబ్ ఇంజెక్షన్ ను వైద్యలు వాడుతున్నారు. దీన్ని తాజాగా కరోనాకు కూడా అత్యవసర పరిస్ధితుల్లో వాడుకోవచ్చని డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియాకు చెందిన డాక్టర్ వీజీ సోమానీ అనుమతి ఇచ్చారు. దేశీయ సంస్ధ బయోకాన్ దీన్ని ఉత్పత్తి చేస్తోంది. కరోనాతో పోరాడే యాంటీబాడీల ఉత్పత్తిలో కీలకమైన సైటోకిన్లను ఇది విడుదల చేస్తుందని డీసీజీఐ చెబుతోంది. ఇప్పటికే ఎయిమ్స్ కు చెందిన పలువురు నిపుణుల పర్యవేక్షణలో ట్రయల్స్ పూర్తి చేశాకే దీని వాడకానికి అనుమతులు ఇస్తున్నట్లు డీసీజీఐ ప్రకటించింది.
రోగుల అనుమతి ఉండాల్సిందే..
కొన్నేళ్లుగా సొరియాసిస్ చికిత్సలో సత్ఫలితాలు ఇస్తున్న ఇటోలీజుమాబ్ ఇంజెక్షన్ ను కరోనా రోగులకు ఇవ్వాలన్నా వారి నుంచి రాతపూర్వకంగా అనుమతి తీసుకోవాల్సిందేనని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ముంబైలోని పలు ఆస్పత్రుల్లో దీని వాడకానికి ఉచితంగా ఈ డ్రగ్ ను సరఫరా చేసేందుకు బయోకాన్ ఇప్పటికే సంసిద్దత వ్యక్తం చేసింది. కరోనా బాధితులపై ఈ డ్రగ్ ప్రభావవంతంగా పనిచేస్తుందని ముంబైలోని నాయర్ ఆస్పత్రి ఈ ఏడాది మే నెలలోనే ప్రకటించింది. దీంతో ఈ డ్రగ్ వాడకంపై చర్చలు సాగాయి. బయోకాన్ కూడా ఈ డ్రగ్ కరోనాకు వాడకంపై సానుకూలంగానే ఉండటంతో డీసీజీఐ అనుమతులు మంజూరు చేసింది.
డ్రగ్ వాడకం పరిమితులివే..
బయోకాన్ ఉత్పత్తి అయిన ఇటోలీజుమాబ్ ఇంజెక్షన్ రోగులకు ఇచ్చేముందు కొన్ని కీలక అంశాలను దృష్టిలో ఉంచుకోక తప్పదు. వీటిలో సదరు రోగి కిడ్నీ, కాలేయం సమస్యలతో బాధపడుతున్నారా లేదా అనే దానిపై డోస్ ఆధారపడి ఉంటుంది. రోగి కాలేయం, కిడ్నీల పనితీరు ఆధారంగానే వీటి డోస్ నిర్ణయిస్తారు. ఈ లెక్కన కొందరికి ఒక డోస్ సరిపోతుండగా... మరికొందరికి రెండు, మూడు డోస్ ల వరకూ ఇవ్వాల్సిన పరిస్ధితి ఉంటోందని మంబైలోని నాయర్ ఆస్పత్రి గతంలోనే ప్రకటించింది. దీంతో ఈ డోస్ నిర్ణయాన్ని రోగిని పరీక్షిస్తున్న నిపుణులైన డాక్టర్లకే వదిలిపెట్టినట్లు తెలుస్తోంది.