అమ్మా నువ్వంటే ఇష్టం, ప్రాణాలు పోతున్నా.: కంటతడి పెట్టిస్తున్న డీడీ కెమెరామెన్(వీడియో)
Recommended Video
దంతెవాడ: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ ఆరాన్పూర్లో మంగళవారం మావోయిస్టులు జరిపిన దాడిలో మృత్యువాత పడిన దూరదర్శన్ కెమెరామెన్ అచ్యుతానంద్ ప్రాణాలు పోతున్నా తన విధులను నిర్వహించారు. కాగా, ఆయన చివరి మాటలు మనసున్న ఎవరికైనా కంటతడి పెట్టించేలా ఉన్నాయి.
ఎన్నికల వేళ మావోయిస్టుల ఘాతుకం: దూరదర్శన్ కెమెరామెన్ తోపాటు ఇద్దరు జవాన్లు మృతి
ప్రాణాలు పోతున్నా..
మావోయిస్టులు తమను చుట్టిముట్టిన పరిస్థితుల్లో కూడా అక్కడి పరిస్థితులపై రిపోర్టు చేశారు అచ్యుతానంద్. మావోయిస్టుల కాల్పుల్లో బుల్లెట్లు దిగడంతో కుప్పకూలిపోయారు. ప్రాణాలు పోతున్నాయని తెలిసి తన తల్లికి వీడియో ద్వారా సందేశం రికార్డు చేశారు.
తల్లిపై ప్రేమ.. విధుల పట్ల నిబద్ధత
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఆ వీడియో చూస్తే ఎవరికైనా కన్నీరాగదు. అంతేగాక, విధుల పట్ల ఆయనకున్న నిబద్ధత, కన్నతల్లిపై ప్రేమ, ఆప్యాయత కళ్లకు కడుతోంది.
అమ్మా నువ్వంటే ఇష్టం..
‘అమ్మా నువ్వంటే నాకెంతో ఇష్టం. మావోయిస్టులు మమల్ని చుట్టు ముట్టారు. కాల్పులు జరుపుతున్నారు. నా శరీరంలోకి బుల్లెట్లు దిగిపోయాయి. జవాన్లు మావోయిస్టులతో పోరాటం చేస్తున్నారు. నేను ప్రాణాలతో బయటపడతానని అనుకోవడం లేదు' అని ఆ వీడియో సందేశంలో అచ్యుతానంద్ తెలిపారు.
అచ్యుతానంద్తోపాటు ప్రాణాలు కోల్పోయిన నలుగురు
మరోవైపు ఈ ఘటనలో మావోయిస్టుల చేతిలో చనిపోయిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. ఈ దాడిలో తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతున్న జవాన్ రాకేశ్ కౌశల్ బుధవారం ప్రాణాలు కోల్పోయారు. దంతెవాడలో ఎన్నికల ప్రచారాన్ని కవర్ చేసేందుకు దూరదర్శన్ మీడియా బృందం మంగళవారం అక్కడికి వెళ్లింది. అదే సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు మావోయిస్టులు. మావోయిస్టుల కాల్పుల్లో దూదర్శన్ కెమెరామెన్ అచ్యుతానంద్ తోపాటు ఇద్దరు భద్రతా సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.