మీడియా సంస్థలను వెంటాడుతున్న కరోనా.. వైరస్ భయంతో డీడీ న్యూస్ తాత్కాలిక మూసివేత..!
ఢిల్లీ/హైదరాబాద్ : అన్ని వ్యవస్థలను చావు దెబ్బ తీసిన కరోనా వైరస్ ఇప్పుడు వార్తా సంస్థల మీద పంజా విసురుతోంది. కరోరా వైరస్ ప్రభావంతో అన్ని ప్రయివేటు రంగ సంస్థలు, సాఫ్ట్ వేర్ కంపెనీలు కార్యాలయాలకు సెలవిచ్చి, ఇంటినుండే విధులు నిర్వహించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసాయి. చాలా వరకు వ్యవస్ధలు కుప్పకూలిపోయాయి. అంతే కాకుండా కరోనా వైరస్ దెబ్బకు దేశం మొత్తం వణికిపోతోంది. లాక్డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నప్పటికి దేశంలో రోజు రోజుకి రోగుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్నాయి.
దీనికి తోడు కరోనా వల్ల ప్రాణ నష్టం కూడా వందల్లో ఉండడం విస్మయానికి గురిచేస్తోంది. తాజాగా జాతీయ వార్తా సంస్థ అయిన దూర్ దర్శన్ న్యూస్ చానెల్కు చెందిన వీడియో జర్నలిస్ట్ కరోనాతో చనిపోయాడు. దీంతో డీడీ న్యూస్ చానెల్ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది.
దేశ రాజధాని ఢిల్లీలోని దూరదర్శన్ న్యూస్ చానెల్లో వీడియో జర్నలిస్ట్గా పనిచేస్తున్న యోగేశ్ కుమార్ గుండెపోటుతో మరణించాడు. అనుమానంతో అతనికి కరోనా పరీక్షలు చేయగా, పాజిటివ్గా తేలింది. దీంతో ఆ చానెల్లో అదే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న సిబ్బంది మొత్తానికి కరోనా పరీక్షలు చేయినున్నారు న్యూస్ యాజమాన్యం. అందులో భాగంగా డీడీ న్యూస్ చానెల్ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. శానిటైజేషన్ చేసిన తర్వాత, కరోనా ముందస్తు జాగ్రత్తలు జాగ్రత్తలు తీసుకున్న తర్వాత న్యూస్ కార్యాలయాన్ని తెరుస్తామన్నారు. కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేయడం వల్ల వార్తా ప్రసారాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నామని డీడీ న్యూస్కు చెందిన ఒక అధికారి తెలిపారు. కార్యాలయంలో కెమెరా విభాగానికి చెందిన మొత్తం సిబ్బందిలో కొంతమందిని డాక్టర్ రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీడీ న్యూస్ వర్గాలు తెలిపాయి. దీంతో కరోనా దేశంలో ఏ మేరకు వ్యాప్తి చెందుతుందో అర్ధమవుతోంది.