ఢిల్లీ సీఎం కేజ్రీవాల్పై మరో కేసు: జైట్లీ బాటలో డీడీసీఏ
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డీడీసీఏల మధ్య వ్వవహారం రోజు రోజుకీ ముదురుతోంది. ఇప్పటికే కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తనపై అసత్య ఆరోపణలు చేస్తన్నారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్పై పరువు నష్టం దావా కేసు వేయగా, డీడీసీఏ కూడా అదే బాటలో నడవాలని యోచిస్తోంది.
తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్న కేజ్రీవాల్తో పాటు బీజేపీ బహిష్కృత ఎంపీ కీర్తి ఆజాద్లపై పరువు నష్టం కేసు దాఖలు చేయనున్నట్టు బుధవారం ఆ సంస్థ కోశాధికారి రవీందర్ పేర్కొన్నారు. అరుణ్ జైట్లీ డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అందులో అక్రమాలు, అవినీతి జరిగాయని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు.
మంగళవారం ఒక ముందుకేసి డీడీసీఏ అధికారులు జట్టు ఎంపికలో లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను డీడీసీఏ ఖండించింది. సీఎం కేజ్రీవాల్ ఎలాంటి ఆధారాలూ లేకుండా, డీడీసీఏ అధికారులపై గుడ్డిగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది.
ఇప్పటికే ఈ డీడీసీఏ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. డీడీసీఏలో జరిగిన అవకతవకలను వెలికి తీయాలంటే దీనిపై ఒక విచారణ కమిటీ వేయాలంటూ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు ఢిల్లీ ప్రభుత్వం లేఖ కూడా రాసింది. డీడీసీఏ కుంభకోణం కేసు నుంచి జైట్లీని తప్పించడానికే తన కార్యాలయంలో సీబీఐ దాడులు చేయించారని గతంలో కేజ్రీవాల్ విమర్శించారు.
అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలను ఖండించిన అరుణ్ జైట్లీ ఆయనపై పరువు నష్టం కేసు వేశారు. డీడీసీఏతో పాటు ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీపై విమర్శలు చేసిన ఎంపీ కీర్తి ఆజాద్ను బీజేపీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.