ఇదేం లొల్లిరా నాయనా: హల్దీరామ్స్లో వడ సాంబార్ కొంటే బల్లి ఫ్రీ
నాగ్పూర్: నాగ్పూర్లో ఓ పేరుగాంచిన రెస్టారెంట్ ఇప్పుడు అందరి నోళ్లలో నానుతోంది. టిఫెన్ చేద్దామని వెళ్లిన ఓ వ్యక్తి ఆ రెస్టారెంట్లో వడ సాంబార్ బాగుంటుందని ఆర్డర్ చేశాడు. వడ సాంబార్ బాగుందని లొట్టలేసుకుంటూ తింటుండగా ఒక్కసారిగా అనుకోని అతిథి అతని సాంబార్ వడలో ప్రత్యక్షమైంది. వెజ్ కాస్తా నాన్వెజ్ అయ్యిందని లబోదిబోమన్నాడ సదరు కస్టమర్. ఇంతకీ ఆ సాంబార్ వడలో ప్రత్యక్షమైన అతిథి ఎవరు...? ఆ బ్రాండ్ ఉన్న రెస్టారెంట్ ఏంటి.. తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
హల్దీరామ్స్ హోటల్లో టిఫెన్ చేసేందుకు ఎగబడే జనం
నాగ్పూర్... మహారాష్ట్రలోని మంచి కమర్షియల్ హబ్. ప్రముఖ ఫుడ్ ఔట్లెట్ హల్దీరామ్స్ అంజనీ స్క్వేర్లో ఓ హోటల్ను నడుపుతోంది. నిత్యం రద్దీగా కనిపిస్తుంది ఈ హోటల్. తిండి రుచిగాను శుచిగాను ఉంటుందని అక్కడికి కస్టమర్లు టిఫిన్ చేసేందుకు వస్తూ ఉంటారు. చాలామంది ఆహా ఓహో అని లొట్టలేసుకుంటూ టిఫిన్ లాగించేస్తుంటారు. కానీ ఒక్కసారిగా హల్దీరామ్స్ వార్తల్లో నిలిచింది. ఆ హోటల్ ఒక కస్టమర్కు సర్వ్ చేసిన వడసాంబార్లో చనిపోయిన బల్లి ప్రత్యక్షమైంది. అప్పటికే ఆ వ్యక్తి సగం టిఫెన్ తినేశాడు.
సగం తిన్న తర్వాత బల్లి ప్రత్యక్ష్యం
టిఫిన్ బాగుంటుందని వార్దాకు చెందిన ఓ జంట అక్కడికి వచ్చి వడ సాంబారు ఆర్డర్ ఇచ్చి తింటుండగా ఒక్కసారిగా బల్లి కనిపించడంతో అవాక్కయ్యాడు. బల్లి సాంబార్లో పడిందన్న విషయాన్ని హోటల్ సూపర్వైజర్ దృష్టికి తీసుకొచ్చాడు. వెంటనే ఆ జంటను ఓ ప్రైవేట్ హాస్పిటల్కు చికిత్సకోసం తరలించారు. మంగళవారం ఈ ఘటన జరిగింది. బుధవారం వీరు డిశ్చార్జ్ అయ్యారు. ఈ జంట మీడియాతో మాట్లాడేందుకు ఇష్టపడలేదు. అదేసమయంలో వీరు ఫిర్యాదు కూడా నమోదు చేయలేదు. ఈ ఘటనపై ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అధికారికి బుధవారం సాయంత్రం తెలిసింది.
హోటల్ను మూసివేయించిన అధికారులు
వడసాంబార్లో చనిపోయిన బల్లి కనిపించిందన్న విషయం తెలియగానే... హల్దీరామ్స్ హోటల్ ఔట్లెట్కు వెళ్లి అక్కడి పరిస్థితులను సమీక్షించామని చెప్పారు ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అధికారి మిలింద్ దేశ్పాండే. కిచెన్లో పలు లోపాలు ఉన్నట్లు చెప్పిన ఆయన.. కిచెన్లోని కిటీకిలకు మెష్ను ఏర్పాటు చేయలేదని అన్నారు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ నిబంధనల ప్రకారం అన్ని సరిగ్గా అయ్యే వరకు హోటల్ను మూసివేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. మరమత్తుల తర్వాత తాము సంతృప్తి చెందితేనే హోటల్ తిరిగి కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతిస్తామని దేశ్పాండే చెప్పారు.
మొత్తానికి బ్రాండ్ ఉన్న హోటల్ కదా అని తృప్తిగా టిఫెన్ చేద్దామనుకున్న జంటకు చచ్చిపోయిన బల్లి కనిపించడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. వెంటనే ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆ ఫోటో కాస్త వైరల్గా మారింది. బ్రాండ్ను బట్టి కాదు రుచి శుభ్రత ఉన్న హోటల్కు వెళ్లి మాత్రమే ఆహారం తీసుకోవాలని సూచించారు.