చచ్చిన బల్లితో సహా వడ్డించేశారు.. మెక్ డొనాల్డ్స్ నిర్వాకం, వాంతొచ్చేలా..
బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసి తింటుండగా.. ఫ్రెంచ్ ఫ్రైస్ లో చచ్చిన బల్లి ఒకటి ఆమె కూతురి కంటపడింది.
కోల్కతా: నగర జీవులంతా రెడీమేడ్ లైఫ్ కు అలవాటుపడిన రోజులివి. ముఖ్యంగా తిండి విషయంలో. ఇంట్లో వంట చేసేవాళ్ల కన్నా.. రెస్టారెంట్లు, హోటళ్లలోనే మూడు పూటలా లాగించేవారు లేకపోలేదు. ఇక మధ్య తరగతి కుటుంబ జీవులు సైతం ఏదైనా ప్రత్యేక సందర్బంలో రెస్టారెంట్స్ బాట పట్టడం ఈరోజుల్లో చాలా కామన్ గా మారిపోయింది.
ఇదే తరహాలో కూతురి పుట్టినరోజు సందర్బంగా మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్ కు వెళ్లిన ఓ కుటుంబానికి పెద్ద షాకే తగిలింది. సదరు కుటుంబం ఆర్డర్ చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ లో ఏకంగా ఓ చచ్చిన బల్లి దర్శనమిచ్చింది. దీంతో వాంతులు చేసుకున్న ఆ కుటుంబం.. ఆపై మెక్ డొనాల్డ్స్ మేనేజర్ ను నిలదీసింది. అటు తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది.
పూర్తి వివరాలను పరిశీలిస్తే.. ప్రియాంకా మెయిత్రా అనే మహిళ తన నాలుగేళ్ల కూతురి పుట్టినరోజు సందర్బంగా కుటుంబంతో కలిసి మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్ కు వెళ్లింది. బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసి తింటుండగా.. ఫ్రెంచ్ ఫ్రైస్ లో చచ్చిన బల్లి ఒకటి ఆమె కూతురి కంటపడింది.
దీంతో వెంటనే విషయం మేనేజర్ కు చెప్పగా.. ఆయన క్షమాపణలు చెప్పారు. ఆ ఫుడ్ తీయించి కొత్తవి మళ్లీ ఇస్తానని చెప్పారు. అయితే ప్రస్తుతం గర్భవతిగా ఉన్న ప్రియాంకకు కాసేపటి తర్వాత కళ్లు తిరుగుతున్నట్లు అనిపించడంతో.. గర్భంలో ఉన్న తన బిడ్డ ఆరోగ్యం ఎలా ఉంటుందోనన్న ఆందోళన మొదలైంది.
ఫ్రెంచ్ ఫ్రైస్ లో వచ్చిన చచ్చిన బల్లిని ఫోటో తీసి.. ఆపై ఫూల్ బగన్ లోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇలాంటివి జరిగినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం చాలా ముఖ్యమని, విషాహారం తినడం ప్రాణాలకే ప్రమాదమని ప్రియాంక అన్నారు.