మధ్యాహ్న భోజనంలో మూషికం... విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఎలుక చచ్చిన మధ్యాహ్న భోజనం తిని తొమ్మిది మంది పాఠశాల విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు.
న్యూఢిల్లీ: సాక్షాత్తు దేశ రాజధాని నగరమైన దక్షిణ ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వడ్డించిన మధ్యాహ్న భోజనంలో చచ్చిన ఎలుక వచ్చింది. తెలియక ఆ ఆహారం తిన్న తొమ్మిదిమంది పాఠశాల విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు.
డియోలి ప్రాంతంలోని ప్రభుత్వ బాలుర సీనియర్ సెకండరీ స్కూలులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మధ్యాహ్న భోజనంలో చచ్చిన ఎలుక వచ్చిందని, ఆ భోజనం తిన్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలిసి తాము మదన్ మోహన్ మాలవ్య ఆసుపత్రికి వెళ్లి వైద్యులతో మాట్లాడానని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ట్వీట్ చేశారు.
ప్రస్తుతం విద్యార్థులు కోలుకుంటున్నారని, ఎలుక ఉన్న ఆహారం సరఫరా చేసిన వారిపై కేసు పెట్టడంతోపాటు వారిని బ్లాక్ లిస్టులో పెట్టామని, ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని ఆయన ఆ ట్వీట్ లో వివరించారు.