ఆధార్ లింక్ డెడ్లైన్ వచ్చే ఏడాది మార్చి 31 వరకు, కానీ వాళ్లకు మాత్రమే...
న్యూఢిల్లీ : బ్యాంకు ఖాతాలతోపాటు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవల కోసం ఆధార్ నంబరు అనుసంధానం చేసే గడువు తేదీని వచ్చే ఏడాది మార్చి 31వతేదీ వరకు పొడిగించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది.
ఆధార్ నంబరు అనుసంధానంపై వచ్చిన పిటిషన్లను విచారించేందుకు వచ్చే వారం ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఆధార్ సంబంధిత వ్యవహారాల విచారణకు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా గత అక్టోబరులో వ్యాఖ్యానించారు.
ఆధార్ అనుసంధానంపై స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరగా, సుప్రీంకోర్టు గడువు తేదీని వచ్చే ఏడాది మార్చి 31వరకు పెంచాలని కేంద్రానికి సూచించింది. సుప్రీంకోర్టు ప్రతిపాదనకు కేంద్రం ఒకవైపు అంగీకరిస్తూనే మరో మెలిక పెట్టింది.
వచ్చే ఏడాది మార్చి 31 వరకు గడువు పెంపు కేవలం ఇప్పటి వరకు ఆధార్ కార్డులు పొందలేకపోయిన వారికేనని తేల్చిచెప్పింది. ఇప్పటికే ఆధార్ కార్డు కలిగి ఉన్న వారికి మాత్రం ఈ గడువు పొడిగింపు వర్తించదట.
ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఒక నోటిఫికేషన్ జారీచేయనున్నట్టు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ గురువారం సుప్రీంకోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మొబైల్ సర్వీసులకు ఆధార్ను లింక్ చేసే తుది గడువు ఫిబ్రవరి 6తోనే ముగియనుందని ఆయన పేర్కొన్నారు.